43,284 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ విజయం: సైదిరెడ్డికి రికార్డు మెజారిటీ: ఏకపక్షంగా దూసుకెళ్లారు..!
Recommended Video
హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి గత రికార్డులను బద్దలు చేస్తూ 43,284 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గెలుపు ఖాయమని భావించిన కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం అయింది. కాగా, 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీగా ఇప్పటి వరకు కొనసాగింది. దీనిని సైదిరెడ్డి తిరగ రాసారు. దీనిని సైదిరెడ్డి 15వ రౌండ్లోనే ఆ మెజారిటీని అధిగమించారు. మొత్తం 21 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్ది 43,284 ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా..బీజేపీ..టీడీపీ డిపాజిట్లు కోల్పోయినాయి. ఈ విజయం మీద మరి కాసేపట్లో ముక్యమంత్రి కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. గెలుపు ఖాయమని భావించిన అధికార పార్టీ నేతలు వచ్చిన మెజార్టీ తో వారి సంతోషానికి హద్దులు లేవు.
హుజూర్ నగర్ లో సైదిరెడ్డి గెలుపు..
ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించిన సమయం నుండి తొలి రౌండ్ తో మొదలు పెట్టిన సైదిరెడ్డి విజయ యాత్రం చివరి రౌండ్ వరకు కొనసాగింది. ఓటర్లు ఏకపక్షంగా సైదిరెడ్డికి విజయాన్ని అందించారు.గతంలో ఇదే నియోజకవర్గంలో 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. అయితే తాజాగా సైదిరెడ్డి 15వ రౌండ్లోనే ఆ మెజారిటీని అధిగమించారు. ఇప్పుడు తుది ఫలితం వెల్లడయ్యే సరికి 43,284 ఓట్ల రికార్డు మెజార్టీతో హుజూర్ నగర్ సీటు దక్కించుకున్నారు. తాము గట్టి పోటీ ఇస్తామంటూ బరిలోకి దిగిన బీజేపీ..టీడీపీ డిపాజిట్లు కోల్పోయినాయి. కాగా, సైదిరెడ్డి ఇంత భారీ మెజార్టీతో గెలుస్తారని పార్టీ నేతలు సైతం అంచనా వేయలేదు. 25 వేల నుండి 35 వేల వరకు మెజార్టీ ఉంటుందని ఆశించారు.
కాంగ్రెస్ పట్టున్న ప్రాంతాల్లోనూ..
తొలి రౌండ్ నుండి భారీ మెజార్టీ సాధిస్తూ వచ్చిన సైదిరెడ్డిని కాంగ్రెస్ ఏ ఒక్క రౌండ్ లోనూ నియంత్రించలేక పోయింది. ప్రతీ రౌండ్ లోనూ ఆధిక్యత కొనసాగింది. కాంగ్రెస్ కు పట్టు ఉన్న ప్రాంతాలతో సహా మొత్తం ఏడు మండలాల్లోనూ సైదిరెడ్డి హవా సాగింది. అధికార పార్టీ తొలి నుండి పక్కా వ్యూహాత్మకంగా వేసిన అడుగులు మంచి ఫలితాన్నిచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందంటూ సాగుతున్న ప్రచార సమయంలో ఈ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పార్టీ నేతలకు మంచి బలాన్ని ఇవ్వనుంది. కౌంటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీలు వీవీ ప్యాట్ ల లెక్కింపు కోసం డిమాండ్ చేసారు. అయితే, చివరకు మాత్రం సైదిరెడ్డి సాధించిన మెజార్టీ రికార్డుల్లోకి ఎక్కింది.
ఊహించని మెజార్టీ.. అంచనా వేయలేని పార్టీలు
అధికార పార్టీకి ఇక్కడ ఈ స్థాయిలో మెజార్టీతో గెలుపొండటం పైన అధికార పార్టీకి అంచనాలను మించి ఉంటే.. ఇక, ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడు పడటం లేదు. ఉప ఎన్నికల్లో సాధారనంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు..వీటితో పాటుగా కాంగ్రెస్ కు కంచుకోట లాంటి నియోజకవర్గం కావటం..ప్రతిపక్షాలు అన్నీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటంతో కష్టపడితే ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా కనిపించారు. కానీ, ముఖ్యమంత్రి వ్యూహాల ముందు అవి నిలబడలేదు. అందరికీ ఇదే సమాధానం అన్నట్లుగా తమ పార్టీ అభ్యర్ది సాధించిన మెజార్టీతో ముఖ్యమంత్రి చెప్పకనే తన సమాధానం చెప్పారు. ఆయన ఈ విజయం మీద అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.