దొంగతనం చేసి చిల్లర వేషాలు..! చంద్రబాబు, లోకేశ్పై కేటీఆర్ నిప్పులు
హైదరాబాద్ : గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్న చందంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ ఓటర్ల డాటా కేసులో వాళ్లు చేసిందే తప్పు.. మళ్లీ తండ్రీ కొడుకులు బుకాయింపులకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు ఈ డ్రామాలన్నీ కొత్తేమీ కాదని ఆరోపించారు. తెలంగాణలో కేసు బుక్కయినందుకే ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఫిర్యాదు వస్తే స్పదించడం మా తప్పవుతుందా అంటూ ఎదురుదాడికి దిగారు.
తెలంగాణలో ఫిర్యాదు.. అందుకే ఇక్కడ కేసు
ఏపీ ఓటర్ల డాటా కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్ సంస్థ అవకతవకలకు పాల్పడిందా లేదా అనేది విచారణలో బయటపడుతుందన్నారు కేటీఆర్. చేసిందే దొంగతనం.. ఆపై తండ్రీకొడుకులు బుకాయించడం ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫిర్యాదుదారుడు లోకేశ్వర్ రెడ్డి ఏపీకి చెందిన పౌరుడు అయినప్పటికీ.. తెలంగాణలో ఫిర్యాదు చేశారు కాబట్టి కేసు ఇక్కడే నమోదయిందని తెలిపారు. టీడీపీకి ఆ మాత్రం తెలియదా? ఎందుకీ డ్రామాలంటూ సెటైర్లు వేశారు.
హైదరాబాద్ లో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు వస్తే తెలంగాణ పోలీసులు స్పదించడం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ ఓటర్ల వ్యక్తిగత సమాచారం తస్కరిస్తున్నారనే ఫిర్యాదు రావడంతోనే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు నిర్వహించారని తెలిపారు. అసలు ఏపీ పోలీసులకు ఇక్కడేం పనంటూ ఎదురుదాడికి దిగారు.
చేసేది దొంగతనం.. పైగా రుబాబు..!
తప్పుల మీద తప్పులు చేస్తూనే.. టీఆర్ఎస్ పై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఆరోపించారు కేటీఆర్. బిల్డప్ తప్ప ఈ నాలుగున్నరేళ్లలో ఏపీలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. అందుకే ఈ దొంగ పనులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ఓటర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అంశంలో ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతోంది.. ఒకవేళ మీరు తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మీ పార్టీ తొత్తులకు ఆ దొంగతనం బాధ్యత అప్పగించకుంటే మీరు ఎందుకు షేక్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.
ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు వచ్చింది. విచారణ తర్వాత అన్నీ వివరాలు బయటపడతాయి. ఒకవేళ తప్పు చేయకుంటే ఆ సంస్థకు క్లీన్ చిట్ వస్తుంది కదా. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. దొంగతనం చేస్తూ దొరికిపోయిన కూడా ఇంకా బుకాయించడం.. పైగా తమపై ఆరోపణలు గుప్పించడం సరికాదని.. చంద్రబాబుకు అసలు సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు.
చిల్లర వేషాలు..!
అభివృద్ధి మంత్రం జపించడానికి చేసిందేమీ లేకపోవడంతోనే.. చంద్రబాబు దొడ్దిదారులు వెతుక్కుంటున్నారని ఫైరయ్యారు కేటీఆర్. ప్రజల్లో పరపతి పోయినందుకే ఇలాంటి చీఫ్ పాలిట్రిక్స్ కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రజల సానుభూతి పొందడానికే పొద్దస్తమానం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని చిల్లర వేషాలేసినా.. చిల్లర ప్రయత్నాలు చేసినా జరిగేది జరగక మానదని చెప్పుకొచ్చారు. ప్రజల సమాచారం దొంగిలించనప్పుడు.. ప్రజల అనుమతి లేకుండానే సేవామిత్ర యాప్ లోకి వారి డాటా ఎలా వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు.