సీఎం కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేశారు.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ మంత్రి, అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫెడరల్ వ్యవస్థ, జాతీయ పార్టీలను ఉద్దేశించి కీలక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఉద్ధరిస్తోందనే భావన కరెక్టుకాదని, కేంద్రానికి రాష్ట్రాలే నిధులు సమకూర్చుతుండటం కాదనలేని వాస్తవమన్నారు. గురువారం ఢిల్లీలో 'టైమ్స్ నౌ సదస్సు 2020'లో పాల్గొన్న ఆయన.. టీఆర్ఎస్ గత నిర్ణయాలు, ప్రధాని మోదీపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తీసుకున్న దాంట్లో సగం కూడా ఇవ్వలే..
టైమ్స్ నౌ సదస్సులో భాగంగా ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర' అనే అంశంపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో వెళితే... తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.12లక్షల కోట్లేనని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలపై, ప్రధానంగా తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్రం ఒక్కపైసా సాయం చేయలేదన్నారు.
Recommended Video
అది తప్పని ఆలస్యంగా తెలిసింది..
దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దు విషయంలో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ చాలా పెద్ద తప్పు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ డీమానిటైజేషన్ ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని మొదటిగా సమర్థించింది సీఎం కేసీఆరేనని, నోట్ల రద్దుతో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని నాడు మోదీ చెప్పిన మాటల్ని విశ్వసించడం వల్లే టీఆర్ఎస్ అసెంబ్లీలో కూడీ తీర్మానం చేసిందని మంత్రి గుర్తుచేశారు. అయితే డీమానిటైజేషన్ ఎంత పెద్ద పొరపాటో తర్వాతి కాలంలో తెలిసొచ్చిందని, నాడు ప్రధాని మోదీని సమర్థించినందుకు ఇప్పుడు తీవ్రంగా చింతిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
సీఏఏను అమలు కానివ్వబోము..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో టీఆర్ఎస్ స్టాండ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులోనూ ఓటేశామని కేటీఆర్ గుర్తుచేశారు. సీఏఏతో ప్రజల ప్రాథమిక హక్కులు దెబ్బతింటాయని, మతాల ఆధారంగా పౌరసత్వం నిర్ధారణ రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. సీఏఏలో ముస్లింలను చేర్చకపోవడాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేస్తామని కేటీఆర్ చెప్పారు.
సోయిలేకుంటే ఎలా?
‘‘రాష్ట్రాల సమూహంగా ఇండియా ఒక ఫెడరల్ వ్యవస్థ అని మనందరికీ తెలుసు. దేశ పురోగతికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుండటం చాలా అవసరం. కానీ ప్రస్తుత మోదీ సర్కారుకు దీని ప్రాధాన్యతను గుర్తించినట్లులేదు. తాము తీసుకునే నిర్ణయాల ప్రభావం రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో, అసలు ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న పరిణామాలేంటో కేంద్రానికి సోయి లేకుంటే ఎలా?'' అని కేటీఆర్ ప్రశ్నించారు. గత కొన్ని దశాబ్ధాలుగా జాతీయ పార్టీలు అని చెప్పుకుంటోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని చాలా రకాలుగా నాశనం చేశాయని ఆయన ఆరోపించారు.
ప్రాంతీయ పార్టీలే దేశానికి రక్ష
పెద్ద పార్టీగా ఉంటూ దేశంపై పెత్తనం చెలాయించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ ఆకాంక్షలకు సరైన విలువ ఇవ్వలేదని, అందుకే అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు వెల్లువలా పుట్టుకొచ్చాయని కేటీఆర్ తెలిపారు. బలమైన రాష్ట్రాలతోనే దేశం కూడా బలపడుతుందిగానీ కేంద్రం బలంగా ఉండి రాష్ట్రాలను ఆగం చేస్తే వ్యవస్థ పాడవుతుందన్నారు. ఆయా పరిస్థితులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించగల సత్తా ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందని, తద్వారా దేశానికి కూడా ప్రాంతీయ పార్టీలే శ్రీరామరక్షగా ఉంటాయని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ కు రాజకీయ ప్రత్యర్థులేతప్ప విరోధులు, శత్రువులు కాబోరని అన్నారు.