మా తల్లి కూడా భూనిర్వాసితురాలే.. ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చినోళ్లకు పాదాభివందనం : కేటీఆర్
సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉద్విగ్నంగా మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. ప్రాజెక్టులు నిర్మించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణాల వెనుక ఎందరివో త్యాగాలుంటాయని వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ప్రాజెక్టుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు పాదాభివందనం అంటూ ఉద్విగ్నంగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పుకొచ్చారు.
కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా
అయితే మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తన తల్లి కూడా భూనిర్వాసితురాలేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు కోసం ఆమె తనకు సంబంధించిన భూమిని ఇచ్చారని తెలిపారు. నిర్వాసితుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికంగా నిలవనుందని తెలిపారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఇంజనీర్ల పని తీరు భేషంటూ ప్రశంసించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.