టార్గెట్ రీచ్ అవని ఆ ఎమ్మెల్యేలు... క్లాస్ పీకిన కేటీఆర్... నేరుగా కేసీఆరే రంగంలోకి దిగుతారని వార్నింగ్...
రాష్ట్రవ్యాప్తంగా గత నెల 12వ తేదీ నుంచి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ బలోపేతంపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రతీ నియోజకవర్గానికి కనీసం 50వేల సభ్యత్వాలు నమోదు చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ టార్గెట్ను అందుకోవడంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలకు కేటీఆర్ చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ రీచ్ అవని ఎమ్మెల్యేలు...
రాష్ట్రంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ రెండు రోజుల క్రితం సమీక్ష సమావేశం నిర్వహించారు. చాలావరకు నియోజకవర్గాల్లో 50వేల సభ్యత్వాల నమోదు పూర్తయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇంకా ఆ టార్గెట్ను చేరుకోలేదట. ఇందులో రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూరు,కోరుకంటి చందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామగుండం నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. దీంతో మంత్రి కేటీఆర్ వీరిద్దరికి ఫోన్ చేసి మందలించినట్లు తెలుస్తోంది.
మరో వారం రోజులు డెడ్ లైన్... లేదంటే...
మరో వారం రోజుల్లోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆ ఇద్దరినీ కేటీఆర్ ఆదేశించినట్లు సమాచారం. ఒకవేళ ఆలోపు కూడా టార్గెట్ను చేరకపోతే... తక్కువ సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల జాబితాను సీఎం కేసీఆర్కు పంపిస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు,అక్కడిదాకా వెళ్తే నేరుగా కేసీఆరే వారితో ఫోన్ చేసి మాట్లాడుతారని... ఇక మీ ఇష్టమని చెప్పినట్లు సమాచారం. దీంతో టార్గెట్ రీచ్ అవని ఎమ్మెల్యేల్లో ఒకింత టెన్షన్ నెలకొంది. విషయం కేసీఆర్ దాకా వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చునని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఆ సమావేశానికి రాని నేతలపై ఆగ్రహం...
ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇటీవల కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహాక సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిపై సీరియస్ అయినట్లు సమాచారం. కనీసం సమాచారం ఇవ్వకపోతే ఎలా... ఎవరి మీద అలిగి మీటింగ్కు రాలేదు... అలిగితే ఇక్కడెవరూ బతిమాలేవారు లేరు... అంటూ వారికి చురకలంటించినట్లు తెలుస్తోంది. కీలక ఎన్నికల వేళ ఇంత నిర్లక్ష్య ధోరణి ఏంటని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఆ సమావేశానికి హాజరుకాని నేతల్లోనూ టెన్షన్ నెలకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సభ్యత్వ నమోదు గడువు పెంపు యోచన
సభ్యత్వాల నమోదు విషయానికొస్తే... సుమారు 70 లక్షల మంది టిఆర్ఎస్ పార్టీ సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు కేటీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ ఆదేశించిన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆ లక్ష్యం పూర్తయిందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సుమారు లక్ష సభ్యత్వాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నప్పటికీ అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందన్నారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శుల విజ్ఞప్తి మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో పదిరోజులు పెంచే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.