ట్రంప్ దెబ్బకు హైదరాబాద్ ఐటీ ఢమాల్, తగ్గిన సందడి, వెలవెలబోతున్న మాల్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని హైదరాబాద్ ఐటీ రంగం సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఆ ప్రభావం ఇక్కడి మాల్స్ పై కూడా కనిపిస్తోంది.
హైదరాబాద్: భాగ్యనగరం ఆర్థిక వ్యవస్థకు ఐటీ రంగమే వెన్నెముక. ఒకట్రెండు కాదు.. ఏకంగా రూ. 80 వేల కోట్ల ఎగుమతులు ఏటా ఇక్కడ్నించే జరుగుతున్నాయి. ప్రత్యక్షంగా నాలుగు లక్షల మందికి, పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది ఇక్కడి ఐటీ పరిశ్రమ.
అలాంటి హైదరాబాద్ ఐటీ రంగం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమాని సంక్షోభంలో పడనుంది. ఇది పరోక్షంగా హైదరాబాద్ లోని వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపునున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సంక్షోభంలో ఐటీ...
కొన్ని ఐటీ సంస్థలు ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుండగా, మరికొన్ని సంస్థలు పింక్ స్లిప్ లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగులను కూడా తీసుకునేందుకు ఆయా కంపెనీలు అనాసక్తి చూపుతున్నాయి. ఈ పరిణామం ఐటీ పరిశ్రమకు ఇది పెను విపత్తే. ఈ పరిణామం పరోక్షంగా హైదరాబాద్ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మాల్ కల్చర్ వేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ఇది భారీ మార్పులకే దారితీసే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు.
మాల్స్ కు పెద్ద దెబ్బే...
హైదరాబాద్ నగరంలో మాల్స్ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. రిటైలింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఫుడ్, ఫన్ తదితర విభాగాలన్నీ మాల్స్ దారి పడుతున్నాయి. ఒక్క 2017-18 సంవత్సరంలోనే కనీసం 10కి పైగా మాల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఎర్రమంజిల్, పంజాగుట్ట, మాదాపూర్ లలో ప్రారంభం కానున్న ఎల్ అండ్ టి మాల్స్ తోపాటుగా ఐటీ కారిడార్ అయిన మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో పలు కంపెనీలు అధికశాతం మాల్స్ ప్రారంభం కాబోతున్నాయి.
ప్రభావం తప్పదు...
అయితే ఐటీ పరిశ్రమ ఢమాల్ అయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని పెద్ద పెద్ద మాల్స్ లో కొనుగోళ్ల శాతం గణనీయంగా తగిపోతోంది. దీంతో మాల్స్ నిర్వహణ కూడా భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని మాల్ నిర్వహణ రంగంలోని ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. మాదాపూర్, కేపీహెచ్ బీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని మాల్స్ కు ప్రధాన ఆదాయ వనరు ఐటీ రంగమే. ఇప్పుడు ఈ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుండడంతో పరోక్షంగా ఈ మాల్స్ వ్యాపారంపై ప్రభావం పడుతోంది.
ఏదైనా కొంతకాలమే...
ఐటీ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ మాల్స్ వ్యాపారంపై ప్రభావం కనిపించినా అది స్వల్పకాలికమేనన్నది మరికొందరి వాదన. అలాగని మాల్స్ వ్యాపారం సజావుగా సాగుతుందనే భరోసా కూడా లేదని చెబుతున్నారు. దీనికి కారణం.. మాల్స్ వ్యాపారం అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయివుండడమే. మాల్స్ ఏర్పాటులో కూడా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఏదైనా ఒక ప్రాంతంలో భారీ మాల్ ఉన్నట్లయితే దానికి సమీపంలో మరో మాల్ ప్రారంభించడం వల్ల వ్యాపారంలో పోటీయే తప్ప సందర్శకుల సంఖ్య పెరుగుదలలో పెద్దగా మార్పు ఉండదు.
ఐటీ రంగంపైనే ఆధారపడి...
కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కనీసం నాలుగు నుంచి ఐదు మాల్స్ ఏర్పాటు అవుతున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో.. ప్రారంభం అయ్యాక ఇవి కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.
ఒకప్పటి సందడి ఇప్పుడేదీ?
చాలా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతుండడంతో.. తమ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక క్షణమొక యుగంలా గడుపుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో అన్న ఆందోళనతో చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాలతో కూడా ఆనందంగా గడపలేకపోతున్నారు. ఫలితంగా ఇంతకుముందు వీకెండ్స్ సమయాల్లో మాల్స్ లో కనిపించే సందడి ప్రస్తుతం కనిపించడం లేదు.
ముందే పసిగట్టిన మాల్స్...
అయితే వేసవికాలంలో సందడి కాస్త తక్కువగానే ఉంటుందని ముందే అంచనా వేసిన మాల్స్ నిర్వాహకులు ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రజానీకాన్ని ఆకట్టుకునేందుకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లకు తెరతీశారు. మాల్స్ నిర్వాహకులు అందిస్తోన్న ఖరీదైన బహుమతులు, విదేశీ ప్రయాణాలు వంటి ఆఫర్లుకు జనం కూడా మొగ్గుచూపుతున్నారు.
ఆఫర్లతో ఆకట్టుకునేందుకు...
కూకట్ పల్లిలోని ఓ మాల్ లో ‘డైనోసార్ లోకం' సృష్టించారు మాల్ నిర్వాహకులు. ఇందులోకి అడుగుపెట్టగానే ఏళ్ల నాటి డైనోసార్లు విహరించిన వాతావరణం కనిపిస్తోంది. అంతేకాకుండా నిర్దేశిత మొత్తంలో షాపింగ్ చేసిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా అందిస్తోంది ఈ మాల్. అలాగే మాదాపూర్ లోని ఓ మాల్ నిర్వాహకులు హాట్ వీల్స్ తో కలిపి ‘ఎపిక్ రేస్'ను నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఓ మాల్ లో కూడా షాపింగ్ లో యాభై శాతం వరకు రాయితీలు ఇస్తున్నారు.