ట్రంప్ ఓటమిని అంగీకరించి తీరాలి.. త్వరలోనే రియాలిటీ తెలుసుకుంటాడు : మాజీ భార్య ఇవానా
అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ ముగిసి దాదాపు వారం రోజులు గడుస్తున్నా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటంతో తుది ప్రకటన ఇంకా ఆలస్యమవుతోంది. ఇప్పటికే అధ్యక్ష పీఠం జో బైడెన్ వశమైనప్పటికీ... ట్రంప్ మాత్రం న్యాయ పోరాటం ఆపేది లేదంటున్నారు. ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ (71) ఈ వ్యవహారంపై స్పందించారు.
'ఈ మొత్తం వ్యవహారానికి ఇకనైనా ముగింపు పలకాలని నేను కోరుకుంటున్నా. ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలి. నాకు తెలుసు ట్రంప్ ఎప్పుడూ ఓటమిని ఇష్టపడడు. కానీ ఓడిపోయాడంటే ఓడిపోయినట్లే లెక్క. అయినా ట్రంప్ మాత్రం పోరాటానికి సిద్దమవుతున్నాడు. అయితే త్వరలోనే ఆయన రియాలిటీని గ్రహిస్తాడని అనుకుంటున్నాను. అసలు ఇవేవీ నేను పట్టించుకోను..' అని ఇవానా పేర్కొన్నారు.
అంతేకాదు,ట్రంప్ పొలిటికల్ కెరీర్కి ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనని ఇవానా అని అభిప్రాయపడ్డారు.ఇకపై గోల్ఫ్,పామ్ బీచ్లతో కూడిన సాధారణ జీవితాన్ని గడపబోతున్నారని చెప్పారు. 2024లో మళ్లీ ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతారని తాను భావించట్లేదన్నారు. ఆయన వద్ద చాలా డబ్బు ఉందని... మిగతా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారని అన్నారు. అయితే ఇవానా-ట్రంప్ సంతానమైన ఎరిక్,డొనాల్డ్ జూనియర్తో పాటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైతం... డొనాల్డ్ ట్రంప్ 2024లో మళ్లీ పోటీ చేస్తారని చెబుతుండటం గమనార్హం.
Recommended Video
డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ రికార్డు స్థాయి ఓట్లతో 290 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం ఇప్పటికీ బైడెన్ గెలుపును అంగీకరించట్లేదు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి భంగపడ్డ ట్రంప్... ఇంకా తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలపై పోరాడుతానంటున్నారు. ట్రంప్ ధోరణిపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రపంచ దేశాల ముందు అమెరికా ఎన్నికల వ్యవస్థను,ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని పలువురు రిపబ్లికన్ నేతలు మండిపడుతున్నారు.