ఉపరాష్ట్రపతి పదవి రేసులో.. గవర్నర్ నరసింహన్? నిజమా? పుకార్లేనా?
గవర్నర్ నరసింహన్ రొట్టె విరిగి నేతిలో పడనుందా? అంటే అవుననే సూచనలే కనిపిస్తున్నాయి. ఆయన్ని దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో తెలుగు ప్రజలు కూడా రెండుగా చీలిపోతారేమో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరారు. కానీ వారిద్దరినీ ఒకచోటు కూర్చోబెట్టి హాయిగా వారితో నవ్వుతూ మాట్లాడే వాతావరణం సృష్టించిన ఒకే ఒక వ్యక్తి - గవర్నర్ నరసింహన్.
వివాదాలకు ఆమడదూరంలో ఉండే నరసింహన్.. రెండు రాష్ట్రాలు విడిపోయాక స్వయంగా చొరవ తీసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి నడుమ తలెత్తిన విభేదాలను తగ్గించి సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించారు. ఇది కేంద్రం గమనిస్తూనే ఉంది.
అందుకే, ఇప్పుడు గవర్నర్ నరసింహన్ కు ఒక కీలక పదవి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవును, దేశ ఉపరాష్ట్రపతి పదవిలో ఆయనను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవి కోసం గతంలో నరసింహన్ ప్రధాని మోడీని కలిసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని ప్రధాని మోడీ కొంత సానుకూలంగానే చూస్తున్నట్లు సమాచారం.
గతంలో పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు జరిపిన సమయంలో కూడా గవర్నర్ నరసింహన్ ప్రధానికి కొన్ని సూచనలు అందించారని, అవి మోడీగా బాగా నచ్చాయని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నెలతో ప్రస్తుత ఉపరాష్ర్టపతి హమీద్ అన్సారీ పదవీ కాలం కూడా ముగియబోతోంది కాబట్టి.. ఆ పదవికి గవర్నర్ నరసింహన్ ను ఎంపిక చేసే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాగే జరిగితే, నరసింహన్ రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా!