నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? : బండి సంజయ్
తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో పరాభవం తప్పదన్న భయం కేసీఆర్లో మొదలైందన్నారు. అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మూర్ఖుడి పాలనలో ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
చార్మినార్ గడ్డ మీద గర్జించిన పార్టీ బీజేపీ..
కేసీఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు బండి సంజయ్. చార్మినార్ గడ్డ మీద గర్జించిన పార్టీ బీజేపీ. అలాంటిది ఈ ఆర్మూర్ ఒక లెక్కనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్పై ఈనెల 25న ఆర్మూర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. కారు అద్దాలు కూడా ద్వంసం చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా, నందిపేట్లో ఉన్న ఎంపీ అరవింద్ను పరామర్శించేందుకు సంజయ్ వెళ్లారు. ఎంపీ నివాసానికి వెళ్లి ఆర్మూర్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మేము చావడానికైనా సిద్ధం.. కేసీఆర్ రెడీనా?
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బండి సంజయ్ మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రే దాడులు చేయమని చెబుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. త్యాగాలు చేసేందుకు బీజేపీ నేతలు వెనుకడుగు వేయరన్నారు. దాడులు కాషాయ దళానికి కొత్తేమి కాదు. కేసీఆర్ ఏం త్యాగాలు చేశారని ప్రశ్నించారు. నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ డిప్రెషన్లో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని విరుచుకుపడ్డారు. ప్రజల కోసం తాము చావడానికైనా సిద్ధం .. దానికి కేసీఆర్ రెడీనా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
ప్రజలే గుణపాఠం చెప్తారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగితే.. ప్రజలే గుణపాఠం చెప్తారని హెచ్చిరించారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రభుత్వాలకు తాబేదారులుగా మారని విమర్శించారు. దీనిని నివారించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిపైన నిజామాబాద్ పోలీసులు కేసులు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.