గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హస్తినకు పయనమయ్యారు. అధిష్టానం పిలుపుమేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫలితాల సరళి, మేయర్ ఎన్నిక అంశాలపై మాట్లాడనున్నారు. గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీ తదితరుల్ని కలిసి ధన్యవాదాలు చెప్పనున్నారు. అయితే, ఈ పర్యటనలోనే సంజయ్ భద్రత, భవితవ్యానికి సంబంధించిన మరో కీలక నిర్ణయాన్ని కూడా బీజేపీ హైకమాండ్ తీసుకోనున్నట్లు వినికిడి.
Recommended Video
బీజేపీపై కేసీఆర్ పోరు: భారత్ బంద్లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకి
భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు
గ్రేటర్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 48 సీట్లను గెలుచుకుంది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం చార్మినార్లో గల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర పెద్దలతో సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల సరళిని వివరించనున్నారు. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ ఎలా ముందుకెళ్లాలన్న దానిపైనా జాతీయ నేతలతో బండి సంజయ్ చర్చించనున్నారు. ఈ పర్యటనలోనే బండి.. కాంగ్రెస్ కీలక నేతల విజయశాంతిని ఢిల్లీ పెద్దల వద్దకు తీసుకెళ్లనున్నారు. కాగా,
బండికి ప్రమోషన్ /సెక్యూరిటీ
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మరో హాట్ వార్త చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో బీజేపీ బాగా పంజుకున్న తరుణంలో, 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సంజయ్ సాగిస్తోన్న వ్యూహాలకు, ఆయన పనితీరుకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా చేయాలని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బండిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడం లేదా కేంద్రం నుంచి అదనపు భద్రత కల్పించడంపై తీవ్రంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసులు పలు మార్లు సంజయ్ ని అరెస్టు చేయడం, కొన్ని సందర్భాల్లో దురుసుగా వ్యవహరించడం లాంటి పరిణామాలకుతోడు.. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మతపరమైన ఎత్తుగడలు, విద్వేష వ్యాఖ్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో.. కేసుల వేధింపులు తొలగిపోయేలా సంజయ్ కు ప్రోటోకాల్ పదవిని కట్టబెట్టాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు వినికిడి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. పైగా, బీజేపీలో ఒకే వ్యక్తికి జోడు పదవులు ఇవ్వడం కుదరదు. కానీ చీటికి మాటికి అరెస్టుల నుంచి సంజయ్ కు రక్షణ కల్పించేలా ఏదో ఒక నిర్ణయమైతే ఉండబోతోందని వినికిడి. ఇదిలా ఉంటే..
గ్రేటర్ మేయర్:చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక -ఎంఐఎం-బీజేపీకి అదొక్కటే ఆప్షన్ -సంచలన సమీకరణలు
అంబేద్కర్కు సంజయ్ నివాళి
దేశానికి దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగ నిర్మాతగా పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కొనియాడారు. ఆదివారం(డిసెంబర్ 6న) అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ట్యాంక్బండ్ సమీపంలోని బాబా సాహెబ్ విగ్రహానికి సంజయ్ పూలమాల వేసి నివాళలు అర్పించారు. అంబేద్కర్, ఆయన ఆశయాల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తోన్న తీరును బండి విమ్శించారు..
బీజేపీ అధికారంలోకి రాగానే..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతులను నిర్వహించలేని దుస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని సంజయ్ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ కు తెలిసిరాలేదని, కనీసం అంబేద్కర్ను స్మరించుకుంటే జ్ఞానమైన వస్తుందని అన్నారు. అంబేద్కర్ చరిత్రను భావి తరాలకు చెప్పాలిసిన అవసరం ఎంతైనా ఉందని, 2023లో బీజేపీ అధికారంలోకి రాగానే గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం మాదిరిగానే తెలంగాణలో బాబా సాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.