బీజేపీలో కలకలం: మేం కష్టపడుతుంటే కేసీఆర్పై మీరు అలాగేనా! ఇరకాటంలో టి నేతలు
హైదరాబాద్: కేంద్రమంత్రులు కేసీఆర్ సర్కార్ పైన ప్రశంసలు కురిపించడంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. కేంద్రమంత్రులు అప్పుడప్పుడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఇది బీజేపీలో కలకలం రేపుతోందని అంటున్నారు.
పూనమ్ను లాగి మరో తప్పు!: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?
ఇక్కడ తాము కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే, మీరు వచ్చి ప్రశంసలు కురిపించడం ఏమిటని అసహనం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. అంతేకాదు, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది బీజేపీకి తలనొప్పిగా మారుతోందని అంటున్నారు.
ఇటీవల బ్రేక్
అప్పుడప్పుడు రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్రమంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై స్పందించడం, ప్రశంసించడం చేయాల్సి వస్తుంటుంది. కానీ కేంద్రమంత్రులు అంతకుమించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలు వాపోతున్నారు. గతంలోనే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లగా.. కొద్ది రోజులు ఆగిపోయాయని అంటున్నారు.
కేసీఆర్, ప్రభుత్వ పథకాలపై మహేష్ శర్మ ప్రశంసలు
అయితే, తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి మహేశ్ శర్మ వ్యాఖ్యలతో మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన మహేశ్ శర్మ సీఎం కేసీఆర్ను గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. తెరాస ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.
బీజేపీ కార్యాలయానికి రాకుండానే
వాస్తవానికి మహేశ్ శర్మ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే తొలుత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆహ్వానించారు. కానీ, ఆయన నేరుగా తాను పాల్గొనాల్సిన కార్యక్రమానికి వెళ్లిపోయి తెరాస పాలనపై ప్రశంసలు కురిపించారు. ఇది తెలంగాణ బీజేపీ నేతలకు ఆగ్రహం, అసంతృప్తిని కలిగించింది. ఇక్కడి పరిస్థితిని ఢిల్లీ నేతలకు ఎప్పటికప్పుడు చెబుతున్నా పరిస్థితి కొన్నాళ్లకు మళ్లీ అదేవిధంగా మారుతోందని అంటున్నారు.
మేం అలా చేస్తుంటే మీరు ఇలానా
ఈ విషయాన్ని మరోసారి అధిష్టానం దృష్టికి లేదా సంఘ్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. ఈసారి వారు కేంద్రమంత్రులపై ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారని సమాచారం. కేంద్ర పథకాలను తెరాస ప్రభుత్వం హైజాక్ చేసి తన ఖాతాలో వేసుకుంటోందని, మోడీ ప్రవేశ పెట్టిన పథకాలను తాము క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటే, కేంద్రమంత్రులు వచ్చి కేసీఆర్ను ప్రశంసిస్తే అది ఎలా అని అడుగుతున్నారు. గతంలోను ఇలాంటి పరిస్థితే ఉంటే రామ్ మాధవ్ ద్వారా అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్లగా అదుపులో పెట్టారని, ఇప్పుడు మహేష్ శర్మ మళ్లీ ప్రారంభించారని వాపోతున్నారు.