అపాయింటుమెంట్ ఇచ్చిన మోడీ: రేపు ఢిల్లీకి కేసీఆర్, 17న సీఎంల సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు ఎల్లుండి (శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన రేపు ఢిల్లీకి బయలుదేరి, మరుసటి రోజు ప్రధానితో కలవనున్నారు.
మోడీతో భేటీ సందర్భంగా జోనల్ వ్యవస్థ సవరణలు ఆమోదించాలని కోరనున్నారు. అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే, విభజన హామీలు అమలు చేయాలని ఆయన కోరనున్నారు.
14వ తేదీన ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్ మూడు నాలుగు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. 17న ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. గత నెల కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు నాలుగు రోజుల పాటు అక్కడ ఉంటారని భావించారు.
కానీ ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఒక్క రోజులోనే అర్థాంతరంగా ఆయన పర్యటన ముగిసింది. ఇప్పుడు ప్రధాని అపాయింటుమెంట్ లభించడంతో వెళ్తున్నారని తెలుస్తోంది.