తెలంగాణా విద్యాశాఖ సంచలన నిర్ణయం...ప్రైవేట్ విద్యాసంస్థల ప్రక్షాళన.. అర్హత లేని వారిపై వేటు
కుప్పలు తెప్పలుగా గల్లీకి పదిగా ఉన్న ప్రైవేటు పాఠశాలల ప్రక్షాళనకు తెలంగాణ సర్కారు నడుం బిగించింది. తెలంగాణా విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అందులో భాగంగా తొలి అడుగు వేయనుంది. అర్హత లేకున్నా స్కూల్స్ లో పని చేస్తున్న టీచర్లను ఏరి పారేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తగిన క్వాలిఫికేషన్ ఉండి, ట్రైనింగ్ తీసుకున్న టీచర్లు పని చేస్తుంటే ప్రైవేటు పాఠశాలల్లో సరైన విద్యార్హతలు లేని టీచర్లు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. అందుకే తెలంగాణ విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో అనర్హుల ఏరివేతకు మొదటి అడుగు వేయనుంది.
ఫిబ్రవరి 28 నుండి టీచర్ల వివరాలు సేకరించనున్న విద్యాశాఖ
తెలంగాణ విద్యా శాఖ తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ఫిబ్రవరి 28 నుంచి టీచర్ల వివరాలు సేకరించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హత గల వారిని మాత్రమే కొనసాగించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మొత్తం 42 వేల పాఠశాలల్లో 25 వేలు ప్రభుత్వ పాఠశాలు ఉంటే 12 వేల వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. మిగిలినవి గురుకులాలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని స్కూళ్లు. ఈ పన్నెండు వేల ప్రైవేటు పాఠశాలలు పనిచేస్తున్న ఉపాధ్యాయుల విద్యార్హతలు పరిశీలించి సరైన విద్యార్హతలు ఉన్నవారిని మాత్రమే టీచర్లుగా కొనసాగించాలని ఆదేశించనుంది.
ప్రైవేటు స్కూల్స్ లో అనర్హులైన టీచర్ల బోధనతో విద్యా ప్రమాణాలకు తిలోదకాలు
ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న టీచర్లంతా బీఈడీ, డీఈడీ, పండిట్స్గా ప్రత్యేకశిక్షణ తీసుకున్న వారు కాగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు అలాంటి తర్ఫీదు లేదు అన్నది తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలలలో దాదాపు లక్ష మందికి పైగా టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో సగం మందికి కూడా బీఈడీ, డీఈడీ, టెట్ వంటి అర్హతలు ఉన్న దాఖలాలు లేవు. విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ ట్రైనింగ్ తీసుకుని టెట్ క్వాలిఫై అయిన వారిని మాత్రమే టీచర్లుగా కొనసాగించాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయినా అవేవీ పట్టించుకోకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అర్హతలేని టీచర్లతో విద్యాబోధన చేయిస్తూ బోధనలో నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కుతోంది.
ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల విద్యార్హతలు పరిశీలించనున్న విద్యా శాఖ
ఇక ఈ నేపథ్యంలోనే స్కూళ్లలో టీచర్ల వివరాలను సేకరించాలని తెలంగాణ విద్యాశాఖ తాజాగా నిర్ణయించింది. ప్రతి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే టీచర్ల విద్యార్హతలను సేకరించనుంది. విద్యాశాఖ రూపొందించిన వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నుంచి టీచర్లు, సిబ్బంది వివరాలు సేకరించనుంది. దీనికి నెల రోజుల గడువు విధించింది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఒకే టీచర్తో రెండు, మూడు బడుల్లో పాఠాలు చెప్పిస్తున్నారని అధికారులు గుర్తించారు. అలాగే అర్హతలేని టీచర్లను నియమించి అతి తక్కువ జీవితాలను ఇస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
వివరాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం .. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు
ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు స్పందించాయి. విద్యాశాఖ అడిగిన వివరాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు టీచర్ వృత్తిపై ఆసక్తి కనబరచడం లేదని ప్రభుత్వం టీచింగ్ ఫీల్డ్పై మక్కువ పెంచే కార్యక్రమాలు చేపట్టాలని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కోరుతున్నాయి. తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ స్టెప్ ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న అనర్హులకు చెక్ పెట్టనుంది. ఈ ప్రయత్నం ఏమేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి.