ఉద్యోగి జీతం నుంచే ఈపీఎఫ్, ఈఎస్ఐ కోత: రాష్ట్ర విద్యుత్ సంస్థల లీలలు
ఇటీవల ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యో గుల్ని 'ఆర్టిసన్'గా గుర్తించి, వారి వేతనాల్ని రూ.23వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్: సతీశ్ టీఎస్ఎస్పీడీసీఎల్లో ఔట్సోర్సింగ్ గ్రేడ్-1 ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతనెల వరకు అతనికి ఇఎస్ఐ, ఈపీఎఫ్ కటింగ్స్ పోనూ చేతికి వస్తున్న వేతనం రూ.15,870. ఇటీవల ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యో గుల్ని 'ఆర్టిసన్'గా గుర్తించి, వారి వేతనాల్ని రూ.23వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకేసారి తన వేతనం దాదాపు రూ.8వేలకు పైగా పెరుగుతుందని ఆనందడోలికల్లో మునిగి తేలాడు.
కానీ పెరిగిన అతని వేతనం కేవలం రూ.808 మాత్రమే... ఎందుకిలా జరిగింది? ఇక్కడే సర్కార్.. రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంకెల గారడీ చేశాయి. సాధారణంగా ఒక కార్పొరేట్ సంస్థ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ వసతి కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం హెల్త్ కార్డు వసతి కూడా కల్పిస్తున్నాయి అది వేరే సంగతి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం, దాని పరిధిలో పని చేస్తున్న విద్యుత్ సంస్థలు ఒకవైపు పెంచినట్లు చూపి, మరోవైపు లాగేశాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కనీస గౌరవవేతనాన్ని రూ.19,508గా నిర్ణయించాయి. దానిలో యాజమాన్య వాటాగా ఈపీఎఫ్ (13.15 శాతం), రూ.2,565, ఈఎస్ఐ వాటా (4.75 శాతం) రూ.927 కలిపాయి. (ఈ మొత్తం రూ.3,492) దీంతో కన్సాలిడేటెడ్ గౌరవవేతనం రూ.23వేలు అయ్యింది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగి వేతనంలో ఈపీఎఫ్ వాటా (12శాతం) రూ.2,341, ఈఎస్ఐ (1.75 శాతం) రూ.341, ప్రొఫెషనల్ టాక్స్ రూ.150 విధించింది. ఈ మొత్తం రూ.2,832 అవుతుంది. రూ.23వేల నుంచి రూ.2,832 తీసేస్తే...చేతికి రావల్సిన వేతనం రూ.20,168.
వేతనాల పెంపుపై సర్కార్ ఇలా
ఇది ఒక్క సతీశ్ ఆవేదన మాత్రమే కాదు..విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 23వేలకు పైగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ఉదాహరణకు మాత్రమే ఆర్టిసన్ గ్రేడ్-1 ఉద్యోగి వివరాలు చెప్పాం. మిగిలిన 2,3,4, గ్రేడ్ ఉద్యోగుల్లో పలువురికి పెరిగిన వేతనం కేవలం రూ.400 ఆపై మాత్రమే. యాజమాన్యం తాను చెల్లించాల్సిన సొమ్మును కూడా ఉద్యోగి వాటా నుంచే కట్చేసి, మొత్తంగా వేతనాల్ని పెంచామని ప్రచారం చేసుకుంటోంది. అదే సందర్భంలో గతంలో చదువు లేకున్నా హైస్కిల్డ్ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు గ్రేడ్-1లో ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 250 కు మించిలేదు. హైస్కిల్డ్ నైపుణ్యం ఉన్న ఉద్యోగి చదువు లేని కారణంగా ద్వితీయ గ్రేడ్కు పడిపోయాడు. దీంతో అతనికి పెరిగిన వేతనం అతి స్వల్పం.
కార్పొరేట్ సంస్థల్లా వ్యవహరించిన విద్యుత్ కార్పొరేషన్లు
ఇక్కడే ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తిరకాసు పెట్టాయి. యాజమాన్య వాటాగా చెల్లించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్ము (రూ.3,492)ను కూడా ఉద్యోగి వేతనంలో నుంచే కోత పెట్టాయి. దీంతో పెంచామని చెప్పిన రూ.23వేల వేతనంలో ఉద్యోగి నుంచి కట్ అవుతున్న మొత్తం సొమ్ము అక్షరాలా రూ.6,324. ఫలితంగా ఉద్యోగి చేతికి వస్తున్న వేతనం కేవలం రూ.16,678. అంటే గతంకంటే పెరిగింది రూ.808 మాత్రమే! ఇవే లెక్కల్ని విద్యుత్ సంస్థలు హైకోర్టుకు సమర్పించాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 23 వేల మందికి పైగా కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణకు జారీ చేసిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. వారిని క్రమబద్దీకరించేందుకు అనుసరించిన వ్యూహం తప్పని.. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వారికి వేతనం చెల్లించాలని ఆదేశించింది.
నేరుగా నియామకాలు చేపట్టాలన్న హైకోర్టు
రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని న్యాయస్థానం పరోక్షంగా తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు రాగానే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలపై నిప్పులు చెరిగారు. విద్యుత్ సంస్థల్లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తమ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఆచరణలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అమలు చేయ సంకల్పించిన నిబంధనల కారణంగా గ్రేడ్-4లో ఉన్న ఉద్యోగులకు నైపుణ్యం ఉన్నా...చదువులేని కారణంగా గ్రేడ్-4లోకి దిగజారారు. ఉదాహరణకు టీఎస్ఎస్పీడీసీఎల్లో గ్రేడ్-1 ఉద్యోగులు 189 మంది కాగా, గ్రేడ్-2లో 7,492 మంది, గ్రేడ్-3లో 925 మంది, గ్రేడ్-4లో 10,230 మంది ఉన్నారు. చదువు అర్హతతో ముడిపెట్టడంతో...ఈ గ్రేడ్లను బట్టే వారి వేతనాలు తారుమారయ్యాయి. గతంలో ఈ పరిస్థితి లేదు. చదువు లేకున్నా నైపుణ్యాన్ని బట్టి వారికి గ్రేడ్లను నిర్ణయించారు. వారి పనితీరును చూపి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎమ్డీ రేచల్ ఛటర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు అందుతున్న వేతనాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా వేతనాల సర్దుబాట్లు ఇలా
ఇదిలా ఉంటే ఆర్టిసన్ ఉద్యోగుల వేతనాల ఖరారులో స్థూల వేతనాన్నే పరిగణనలోకి తీసుకున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జి రఘుమారెడ్డి తెలిపారు. వారికి వేతనాలు ఇంత ఇస్తాం... అని యాజమాన్యాలుగా తామేం హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. హైకోర్టు చెప్పిన వేతనాలకంటే సీఎం కేసీఆర్ రూ. వెయ్యి అదనంగా ఇమ్మన్నారని గుర్తు చేశారు. అదే సమయంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జి రఘుమారెడ్డి చెప్పారు. ఔట్ సోర్సింగ్ సంస్థలకు చెల్లించే సొమ్మును కలిపి స్థూలవేతనాలు నిర్ణయించామని, దీనివల్ల గ్రేడ్లను బట్టి రూ.400 నుంచి రూ.1,300 వరకు వేతనాలు పెరిగాయని వివరించారు. యాజమాన్య వాటాగా చెల్లించాల్సిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ సొమ్మును ఏజెన్సీలకు చెల్లించే సొమ్మునుంచి సర్దుబాటు చేశామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జి రఘుమారెడ్డి తెలిపారు.
ఆందోళన బాటలో విద్యుత్ ఉద్యోగులు
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచామని చెప్పిన ప్రభుత్వం మరోసారి వారి పొట్టలు కొట్టేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన వాగ్దానం అమలు చేయడానికి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల్ని సాకుగా చూపుతున్నదని ఉద్యోగులు, కార్మికులు చెప్తున్నాు. వేతనాలు పెంచుతామంటే కార్మిక సంఘంగా అంగీకరించామని, అంకెల గారడీతో ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల వేతనాల్లో గ్రేడ్లు నిర్ణయించినట్టే ఆయా గ్రేడ్ల పనివిధానంపై కూడా విధివిధానాలు ఖరారు చేయాలని సర్కారు ప్రకటించిన స్కేల్స్ వల్ల ఉద్యోగులు కోల్పోతున్న వీడీఏతోపాటు ఐఆర్, షిఫ్ట్, డస్ట్ అలవెన్స్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.