ఆ మూడు నెలలకు అద్దె అడగొద్దు, వడ్డీ తీసుకోవద్దు: తెలంగాణ సర్కారు హెచ్చరిక
లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి 3 నెలల వరకు యజమానులు ఇంటి అద్దెలు వసూలు చేయరాదని తెలంగాణ పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేగాక, మూడు నెలల తర్వాత బకాయిలను వాయిదాల్లో తీసుకోవాలని ఇంటి యజమానులను ఆదేశించింది. అద్దెలు ఇవ్వాలని, ఖాళీ చేయాలని వేధించొద్దని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అంటు వ్యాధుల నిరోధక చట్టం 1897, విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పురపాలిక కమిషనర్లకు అధికారాలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, తెలంగాణలో గురువారం కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 13, జోగులాంబ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తాజాగా నమోదైన 27 కేసులతో 970కి చేరాయి. గురువారం ఉదయం ఒకరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరింది. తాజాగా 58 మందితో కలిపి ఇప్పటి వరకు 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 693 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.