అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు స్కూల్స్పై చర్యలేవీ?: సర్కారుకు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలలపై ఏం చర్యలు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఫీజులు, మధ్యాహ్న భోజనం అంశాలపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, చెల్లించకపోతే అడ్మిషన్ రద్దు చేస్తున్నాయని పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు.
పాఠశాలల ఫీజులకు సంబంధించి ఇప్పటికే జీవోలు జారీ చేసినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది సంజీవ్ కుమార్ కోర్టుకు తెలిపారు. జీవో ఉల్లంఘించిన 27 పాఠశాలలకు నోటీసులు ఇచ్చామని, వాటిలో కొన్ని వివరణ కూడా ఇచ్చాయని తెలిపారు. గుర్తింపు రద్దు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
కాగా, ఫీజులపై యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లిన ఓ విద్యార్థి తల్లిదండ్రులపై బోయిన్పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారని న్యాయవాది శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టివ్ విజయ్ సేన్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థుల నుంచి కొన్ని ప్రైవేటు పాఠశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.