ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?
రాష్ట్రాల మధ్య పోటీతత్వం మంచిదే.. కానీ ఆ పోటీ మంకుపట్టుగా మారితే అనర్థాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య పోటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షల నిర్వాహణ, ఫలితాల ప్రకటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న కోల్డ్వార్ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా ఒక్కరోజు ముందైనా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.
ఏప్రిల్ 9 లేదా 10న ఇంటర్ ఫలితాలు?
తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్మీడియన్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21 స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లలో పేపర్ల మూల్యాంకనం జరుగుతోంది. అయితే ఈ నెల 10న ఇంటర్ రిజల్ట్స్ ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటించింది. దీంతో ఏపీ కన్నా కనీసం ఒక్కరోజు ముందు ఫలితాలు వెల్లడించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించనట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 9 లేదా 10వ తారీఖుకల్లా ఫలితాలు సిద్ధం చేయాలని ఇంటర్ బోర్డుకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
అధ్యాపకులపై అదనపు భారం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డుపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీకల్లా పేపర్ వాల్యుయేషన్, తదుపరి ప్రక్రియను వీలైనంత తొందరగా ముగించి గడువులోగా రిజల్ట్స్ రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అధికారులు వాల్యూయేషన్లో పాల్గొంటున్న లెక్చరర్లపై అదనపు పని భారం మోపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు 30 పేపర్లు దిద్దాల్సిన అధ్యాపకులతో 45 పేపర్లు దిద్దిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక్కో లెక్చరర్ ఉదయం 15, మధ్యాహ్నం 15 పేపర్ల మూల్యాంకనం చేయాల్సిఉంటుంది. కానీ ఇప్పుడు వారితో రోజుకు 45 పేపర్లు దిద్దిస్తుండటంతో పేపర్ వాల్యూయేషన్లో పాల్గొంటున్న వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది మూల్యాంకనంపై ప్రభావం చూపుతుందని అధ్యాపకులు అంటున్నారు.
అధ్యాపకులపై కొరవడిన పర్యవేక్షణ
పేపర్ వాల్యూయేషన్లో పాల్గొంటున్న లెక్చరర్లపై సరైన పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. మూల్యాంకనంలో పాల్గొనే అధ్యాపకులు సెంటర్కు ఎప్పుడొస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? అనే విషయాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఉదయం 10 గంటలకు పేపర్ వాల్యుయేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొందరు లెక్చరర్లు 12 గంటలకు వచ్చి సాయంత్రం 4గంటల కల్లా 45 పేపర్లు దిద్ది వెళ్తున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ కొరవడటంతో నాలుగైదు గంటల్లో వారు పేపర్ వాల్యుయేషన్ పూర్తిచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెక్చరర్ల తీరు వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇష్టానుసారం నియామకాలు
పేపర్ వాల్యుయేషన్లో పాల్గొనే లెక్చరర్ల నియామానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయితే అవేవీ ఖాతరు చేయని అధికారులు ఇష్టానుసారంగా నియామకాలు జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీల్లో పనిచేసిన అనుభవంలేని వారు సైతం పైరవీలతో పేపర్లు దిద్దే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కార్పొరేట్ కాలేజీలు తమ లెక్చరర్లను వాల్యుయేషన్కు పంపకుండా ట్యూటర్లకు ఆ బాధ్యత అప్పగిస్తుండటంతో పేపర్ వాల్యుయేషన్ పూర్తి అస్తవ్యవస్తంగా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది మొత్తం కష్టపడి చదివిన పిల్లలకు ఏ మేరకు న్యాయం జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.