తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఎట్టకేలకూ స్పష్టత ఏప్రిల్ 18న ఫలితాలు విడుదల
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్కు సంబంధించి స్పష్టత వచ్చింది. ఈ నెల 18న ఫలితాలు వెల్లడించనున్నట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఫలితాల వెల్లడి విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో అనుమానాలను నివృత్తి చేస్తూ ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. బోర్డు ప్రకటన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఊరట లభించింది.
బోర్డు తీరుపై విమర్శలు
తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాల విడుదలలో చేస్తున్న జాప్యంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షలు పూర్తై నెల రోజులు కావస్తున్నా ఇంకా ఫలితాలు ప్రకటించకపోవడంతో బోర్డు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతోందని పలువురు వాపోయారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరగగా.. ఏపీలో గత శుక్రవారం రోజునే ఫలితాలు విడుదల చేశారు.
కంప్యూటరీకరణలో జాప్యం
పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తైనా.. మార్కుల లిస్టును కంప్యూటర్లలో పొందుపరిచే ప్రక్రియ ఆలస్యం కారణంగానే ఫలితాల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆ బాధ్యతలను అనుభవంలేని సర్వీస్ ప్రొవైడర్లకు అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వచ్చాయి. ఇంటర్ బోర్డు పెద్దలు కమిషన్ల కోసమే సదురు సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలపై బోర్డు పెద్దలు స్పష్టతనివ్వడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.
మూల్యాంకనంపై విమర్శలు
పేపర్ వాల్యుయేషన్లో పాల్గొనే లెక్చరర్ల నియామానికి సంబంధించి కొన్ని నిబంధనలు తెలంగాణ ఇంటర్ బోర్డు పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. మార్గదర్శకాలను పక్కనబెట్టి అధికారులు ఇష్టానుసారంగా నియామకాలు జరిపారన్న ఆరోపణలు వినిపించాయి. కాలేజీల్లో పనిచేసిన అనుభవంలేని వారు సైతం పైరవీలతో పేపర్లు దిద్దే అవకాశం దక్కించుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది మొత్తం కష్టపడి చదివిన పిల్లలకు భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.