రంగు పడింది: సకల నేరస్తుల సర్వేలో అవేం ప్రశ్నలు?: పోలీసులపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు చేపట్టిన సకల నేరస్తుల సమగ్ర సర్వేపై హైకోర్టు మండిపడింది. తెలంగాణలోని నేరస్తులు, నేరచరితుల వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇటీవల ఈ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే.
నేరస్తుల వివరాలు సేకరించడంపై హైకోర్టు కన్నెర్ర జేయడంతో ఇకనుంచి ఈ సర్వే చేయబోమని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి నివేదించారు. ఈ విషయంలో ఎవరైనా తమ డేటా దుర్వినియోగమైందని భావిస్తే.. తమ వద్దకు రావొచ్చునని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.\
సకల నేరస్తుల సమగ్ర సర్వేలో అభ్యంతరకరమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నాయని గతంలో హఫీజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ పోలీసు శాఖను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ సోమవారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా డీసీపీ (డీడీ, సీసీఎస్) అవినాష్ మహంతి స్వయంగా కోర్టుకు హాజరై.. అభ్యంతరకర ప్రశ్నలు సమగ్ర సర్వే నుండి తొలగిస్తున్నామని తెలియజేశారు. దీంతో న్యాయస్థానం పిటిషన్పై విచారణను ముగించింది.
మరోవైపు ఈ సర్వేను ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా పోలీసు అధికారులకు గురువారం తాజాగా సర్క్యులర్ పంపించారు. సకల నేరస్తుల సమగ్ర సర్వేను తక్షణమే నిలిపివేస్తున్నామని, ఈ విషయాన్ని అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయాలని అందులో ఆదేశించారు.