నిరుద్యోగులకు తీపి కబురు: 2,939 పోస్టుల భర్తీకి నేడు ప్రకటన: అర్హతలివే..!
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక అవకాశం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2,939 పోస్టుల భర్తీకి మరి కాసేపట్లో నియామక ప్రకటన విడుదల చేయనుంది. భారీసంఖ్యలో జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నియామకాలు చేపట్టుతుండటంతో నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి చేపట్టడం ఇదే తొలిసారి కావటంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను తెలంగాణ ట్రాన్స్కో ఇటీవలే పూర్తి చేసింది.
ఇక, టీఎస్ఎస్పీడీసీఎల్ నియామక ప్రకటనలో సైతం ఇవే రకమైన విద్యార్హతలు ఉండే అవకాశాలున్నాయి. ట్రాన్స్కో ప్రకటన ప్రకారం.. జూనియర్ లైన్మెన్ పోస్టులకు టెన్త్తో పాటు ఎలక్ట్రికల్/ వైర్మెన్ ట్రేడ్స్లో ఐటీఐ, ఎలక్ట్రికల్లో రెండేళ్ల ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుకు బీఏ, బీకాం, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ కోర్సు లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. ఇప్పుడు తాజాగా జారీ చేస్తున్న నోటిఫికేషన్ ద్వారా దాదాపు మూడు వేల పోస్టులు భర్తీ చేస్తుండటంతో..విధి విధానాలు నోటిఫికేషన్ లో స్పష్టం చేయనున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నోటీఫికేషన్ విడుదల కానుండటంతో వారు కోరే అర్హతలు.. రిజర్వేషన్ల వివరాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా విడుదల చేస్తున్న ఈ నోటీపికేషన్ ద్వారా 2,438 జూనియర్ లైన్మెన్, 24 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 477 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నియామక ప్రకటన పూర్తి వివరాలను అక్టోబర్ 10న విద్యుత్ సంస్థలకు చెందిన అధికారిక వెబ్సైట్లలో పొందపర్చనున్నారు. పోస్టుల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు గడువు, పరీక్ష తేదీ తదితర వివరాలు ప్రకటనలో వెల్లడించనున్నారు. తెలంగాణలో వరుసగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని అంచనా వేసారు. అయితే, ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఇప్పుడు విద్యుత్ సంస్థలు జారీ చేస్తున్న నోటిపికేషన్ కోసం ఆసక్తి..పోటీ పెరిగింది.