నిరుద్యోగులకు కొత్త సంవత్సరం కానుక: టిఎస్పిఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కొత్త సంవత్సరం కానుకను అందించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ను టిఎస్పిఎస్సీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. 434 పోస్టులకు నోటిఫికేషన్ను జారీ చేస్తోన్నట్టు తెలిపింది.
ఉద్యోగార్థులు గురువారం నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఉద్యోగాల భర్తీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ఎస్టీవో, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
గురువారం టిఎస్పిఎస్ మరిన్ని నోటిఫికేషన్లు జారీ చేయవచ్చునని భావిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణలోని నిరుద్యోగులు టిఎస్పిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలపై వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
టీఎస్పీఎస్సీ ద్వారా మరో 350 పోస్టులకు కూడా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్వర్క్స్లో డిప్యూటీ మేనేజర్, టెక్నికల్ గ్రేడ్-2, వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులను భర్తీ చేయనున్నారు. టిఎస్పిఎస్సీ నాలుగు నోటిఫికేషన్లను విడుదలు చేసింది. మొత్తం 796 పోస్టులను భర్తీ చేయనున్నారు.
టిఎస్పిఎస్సీ చైర్మన్గా ఘంటా చక్రపాణి వ్యవహరిస్తున్నారు. గ్రూప్ పరీక్షలకు సిలబస్ను ఇప్పటికే ఖరారు చేశారు.