గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సన్నాహాలు.. త్వరలో టీఎస్పీఎస్సీ ప్రకటన..!
Recommended Video
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. మల్టీజోనల్ ఆధారంగా పోస్టుల విభజన ప్రక్రియను సీఎస్ సమీక్షిస్తున్నారని.. అది పూర్తయితే త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామంటున్నారు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్.
ఇప్పటివరకు ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న అన్నీ పోస్టులకు రాత పరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ఉద్యోగ ప్రకటనల ప్రతిపాదనలు పెండింగ్ లో లేవని చెప్పారు. ఈ నాలుగేళ్లలో మొత్తం 36,182 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా.. 16,050 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. వీటికి సంబంధించి ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అయితే మరో 14,488 పోస్టులకు రిజల్స్ట్ తో పాటు మెరిట్ లిస్టులు ప్రకటించామని.. నియామకాల ప్రక్రియ మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారు.
కొన్ని నియామకాలకు సంబంధించి అర్హతల విషయంలో కొందరు కేసులు వేశారని.. అందుకే అవి పూర్తిచేయడంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. కేసులు పరిష్కరించుకుంటూ ముందుకెళుతుండటంతో కొన్ని నియామకాలకు సమయం పడుతోందని చెప్పారు.