గడువు పొడగింపు: టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
తొలి నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా 31 జిల్లాలవారీగా కాకుండా పాత 10 జిల్లాల ప్రకారం కేటగిరీల వారీగా పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను ప్రకటిస్తుంది. వాస్తవానికి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల మెమో జారీ చేసింది. దీనిపై టీఎస్పీఎస్సీకి లేఖ రాసింది.
అయితే 31 జిల్లాల వారీగా ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఇప్పుడు 10 జిల్లాల వారీగా భర్తీ కోసం జీవోనే ఇవ్వాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నిర్ణయానికి వచ్చారు. దీనిపై కడియం శ్రీహరి అధికారులతో మాట్లాడారు.
ఆ తర్వాత సోమవారం రాత్రి జీవో జారీ అయింది. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అందులో టీఎస్పీఎస్సీకి సూచించారు. ప్రభుత్వం సూచించే అధికారి నియామక పత్రాలు అందజేస్తారని స్పష్టం చేశారు.
విద్యాశాఖ నుంచి పాత 10 జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను ఇప్పటికే తీసుకుంది. వాటి పరిశీలనను కూడా పూర్తయిన నేపథ్యంలో.. మంగళవారమే టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్కు సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
పది జిల్లాల ప్రకారం భర్తీ చేయనున్న 8,792 పోస్టులకు పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీల మధ్య నిర్వహించే విధంగా టీఎస్పీఎస్సీ షెడ్యూల్ను సిద్ధం చేసింది. కేటగిరీల వారీగా, తేదీల వారీగా పరీక్ష తేదీలను సవరణ ప్రకటనలో వెల్లడిస్తుంది లేదా ఆ తర్వాత ప్రకటిస్తారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 30తోనే దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు గడువిచ్చారు. తాజాగా మరో 15 రోజులు పొడిగించారు.