టీఎస్పీఎస్సీ నుంచి మరో 2నోటిఫికేషన్లు: త్వరలో 3878 ఖాళీలు భర్తీ చేస్తామన్న ఘంటా
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తాజాగా మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ ఏర్పడి డిసెంబర్ 18కి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రూపొందించారు.
వెబ్ సంచికను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ దేశానికే ఆదర్శంగా నిలిపామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ఏర్పడి నేటికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా.. టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను ప్రారంభించుకున్నామని తెలిపారు.
సోమవారం ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు నోటిఫికేషన్లను విడుదల చేశామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటరైజేషన్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే గురుకులాలకు సంబంధించిన, ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలు ఫలితాలను వారం, పదిరోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు.
2018 సంవత్సరంలో మరికొన్ని నోటిఫికేషన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మరో 3878 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్లు విడుదలవుతాయని అన్నారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉన్నామని, ఈ మేరకు కమిటీకి రిపోర్టులు పంపామని తెలిపారు.