కుటుంబ సభ్యుడిని కోల్పోయా: నందమూరి హరికృష్ణ మృతిపై టీఎస్సార్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మృతి చెందడంతో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టీ సుబ్బరామి రెడ్డి గురువారం అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా పలుమార్లు కలిసేవాళ్ళమని చెప్పారు. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి అన్నారు.
తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణమని తెలిపారు. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే శక్తి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.