6 వేల బస్సులు: రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు, ప్రతీ ట్రిప్పు తర్వాత శానిటైజ్
హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో.. రహదారులపై ఆర్టీసీ బస్సులు వచ్చాయి. లాక్ డౌన్ వల్ల 58 రోజులపాటు డిపోలకే పరిమితమైన బస్సుల హారన్ మోగిస్తూ ముందుకుసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల బస్సులు నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ఆర్టీసీ చార్జీలు పెంచుతారనే ఊహాగానాలు వినిపించినా... గత ఛార్జీలనే ప్రయాణికుల నుంచి తీసుకుంటామని సంస్థ వెల్లడించింది.
Recommended Video
హైదరాబాద్ బ్యాంకులో కరోనా కలకలం.. 11 మంది క్వారెంటైన్కు తరలింపు..
6 గంటల నుంచి..
ఉదయం 6 గంటల నుంచి బస్సుల ట్రిప్పులు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటల లోపు సదరు డిపోకే చేరుకోవాలి. రాత్రి 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. గంట అటు ఇటు అయితే ఓకే.. కానీ అంతకన్నా ఎక్కువ సమయం అయితే మాత్రం అనుమతించబోమని సీఎం కేసీఆర్ సోమవారం రోజున ప్రెస్ మీట్లో కుండబద్దలు కొట్టారు. అలాగే ఎంజీబీఎస్ వరకు బస్సులను అనుమతించరు. ఆ ప్రాంతం కంటోన్మెంట్ జోన్లలో ఉండటంతో పర్మిషన్ ఇవ్వడం లేదు.
ఇక్కడే స్టాప్..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు.. జేబీఎస్ వరకే అలో చేస్తారు. వరంగల్ బస్సులు ఉప్పల్, నల్గొండ బస్సులను హయత్ నగర్ నుంచి నడిపిస్తారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చేవి ఆరాంఘర్, సంగారెడ్డి నుంచి వచ్చేవి బీహెచ్ఈఎల్ వరకు మాత్రమే పర్మిట్ చేస్తారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఆటోలు, ట్యాక్సీలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో సిటీ బస్సులను కూడా అనుమతించడం లేని విషయం తెలిసిందే. అంతరాష్ట్ర బస్సులు నడిచేందుకు అనుమతి లేకపోవడంతో.. సరిహద్దుల వద్ద నిలిచిపోనున్నాయి.
శానిటైజ్
వైరస్ దృష్ట్యా అన్ని డిపోల్లోని బస్సులను శానిటైజ్ చేశారు. బస్సు ప్రతీ ట్రిప్పు తర్వాత డిపోకి వెళుతుంది. అక్కడ శానిటైజ్ చేశాకే.. మరో ట్రిప్పు వెళ్లనుంది. బస్సు ఎక్కేముందు ప్రయాణికులకు థర్మల్ స్కీనింగ్ చేస్తారు. మాస్క్ వేసుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. డ్రైవర్, కండక్టర్ కూడా విధిగా మాస్క్ ధరిస్తారు. బస్సు స్టార్ట్ కావడానికి ముందే కండక్టర్ వద్ద టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.