రాజకీయాలకు గుడ్ బై: ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సంచలన నిర్ణయం, మనస్తాపం చెందారా?
కరీంనగర్: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈ టీఆర్ఎస్ నేత సంచలన ప్రకటన చేశారు.
సోమవారం కరీంనగర్ ప్రయాణ ప్రాంగణంలోని అభివృద్ధి పనుల్ని పరిశీలించేందుకు వచ్చిన సోమారపు సత్యనారాయణ అనూహ్యంగా తన అంతరంగాన్ని మీడియాకు వ్యక్తపర్చారు.
మనస్తాపం లేదంటూనే..
వ్యక్తిగత నిర్ణయంతోనే తాను వైదొలుగుతున్నానని.. ఇందులో మనస్తాపమేమి లేదని స్పష్టం చేశారు. అయితే, చాలారోజులుగా ఇక రాజకీయాలు చాలనుకుంటున్నానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనసాగడం తనకు ఇష్టంలేదని చెప్పారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నానని సోమారపు వెల్లడించారు.
పార్టీ ఆదేశాలను రుద్దలేకపోయా..
రామగుండం నగరపాలక సంస్థలో అధికార పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం దిశగా తీసుకున్న నిర్ణయం పార్టీ అధిష్టానానికి ఇష్టం లేదని.. పార్టీ అధిష్టానం చెప్పిన నిర్ణయాన్ని తమ పార్టీ నాయకుల మీద తాను గట్టిగా రుద్ద కపోయానని చెప్పారు. క్రమశిక్షణను సరిగ్గా నిర్వహించలేకపోయానని సోమారపు సత్యనారాయణ తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్పై..
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్లు మంచిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పార్టీలో తాను చేసిన సేవకు గుర్తించి కేసీఆర్ ఛైర్మన్గా బాధ్యతల్ని అప్పగించారని, వారు ఆశించిన మేరకు తాను పనిచేయలేకపోతున్నానని చెప్పారు.
ఆర్టీసీ ఛైర్మన్ పదవికి కూడా..
తన నిర్ణయానికి రాజీనామా రంగు పూయనని తెలుపుతూనే, ఒకటి రెండు రోజుల్లో ఛైర్మన్ పదవి నుంచి కూడా రిలీవ్ చేయాలని అడుగుతానని తెలిపారు. ఒకవేళ చేయకున్నా తానే స్వచ్ఛందంగా వైదొలుగుతానని సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు.
అధిష్టానం నుంచి ఫోన్ వస్తుందనికోనూ..
అధిష్ఠానం నుంచి తనకెలాంటి ఫోన్ రాలేదని, వస్తుందని కూడా తాను భావించడంలేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలపై అడిగిన ప్రశ్నని ఆయన కొట్టిపడేశారు. రాజకీయాలనుంచే వైదొలుగుతున్నప్పుడు ఇతర పార్టీలో చేరే ప్రస్తావనకు తావుండదని సోమారపు స్పష్టం చేశారు.