తెలంగాణలో ఆర్టీసి చార్జీల మోత: ఈ నెల 27 నుంచి అమలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల మోత మోగింది. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి ఛార్జీల పెంపును అధికారికంగా ప్రకటించారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూ.1, 30 కిలోమీటర్లు దాటితే రూ.2 పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన చార్జీలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు.
సిటీ బస్సులు, డీలక్స్, ఏసీ బస్సుల్లో 10 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలపై భారం మోపకూడదని అనుకున్నప్పటికీ అనివార్యమైన పరిస్థితుల్లో మాత్రమే ఛార్జీలు పెంచామని ఆయన చెప్పారు. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయట పడేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో గత సంవత్సరమే ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏడాది ఆలస్యంగా ఛార్జీలు పెంచుతోందని అన్నారు. ఆర్టీసీలో త్వరలో 1200 కొత్త బస్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆర్టీసి నష్టాల్లో నడవడంపై ఇటీవల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆర్టీసిపై సమీక్ష జరిపి నష్టాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దాన్ని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చారు.