రూ.1 కోసం గొడవ: నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు!
హైదరాబాద్: ప్రయాణీకులకు, బస్సు కండక్టర్లకు మధ్య చిల్లర విషయంలో వివాదం జరగడం తరుచూ చూస్తుంటాం, వింటుంటాం. అయితే, ఒక్క రూపాయి కోసం జరిగిన గొడవ హైదరాబాద్ నగరంలో చాలా బస్సులు నిలిచిపోయేలా చేసిందని తెలుస్తోంది.
నగరంలో కొన్నిచోట్ల సోమవారం ఉదయం బస్సులు ఆగిపోయాయి. బస్సులు ఆగడంపై ముందస్తు ప్రకటన చేయలేదు. సమ్మె లేదు. అయితే, ఎందుకు నిలిచాయో ఎవరికీ అర్థం కాలేదు. అయితే, కేవలం ఒక్క రూపాయి కోసం కొన్ని బస్సులు రోడ్డెక్కలేదని తెలుస్తోంది.
ఒక్క రూపాయి కోసం ఓ మహిళా కండెక్టరు, ప్రయాణికురాలి మధ్య జరిగిన తగాదాయే హైదరాబాదులో రోడ్ల పైకి రావాల్సిన సగం బస్సులను అడ్డుకుందని తెలుస్తోంది. ఉప్పల్ డిపోలో పనిచేస్తున్న ఓ మహిళా కండక్టర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ ప్రయాణికురాలికి ఇవ్వాల్సిన రూపాయి చిల్లరపై వాగ్వాదం జరిగింది.
తన వద్ద చిల్లర లేదని కండక్టర్, రూపాయి కోసం ఆ ప్రయాణికురాలు వాగ్వాదం తారాస్థాయికి పెరిగిందని తెలుస్తోంది. అనంతరం సదరు ప్రయాణికురాలు అదికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిన అధికారులు ప్యాసింజర్తో అనుచితంగా ప్రవర్తించావంటూ రత్నకుమారిని సస్పెండ్ చేశారని సమాచారం. విషయం తెలుసుకున్న పలు డిపోల కార్మికులు మూకుమ్మడి సమ్మెకు దిగారు. కొన్ని యూనియన్ల ఉద్యోగుల నుంచి మద్దతు లభించలేదు. దీంతో సగం బస్సులు డిపోలకు పరిమితం కాగా, మరికొన్ని తిరిగాయి.