టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు షాక్: జీతాలుగా రూ. 7, రూ. 57, రూ. 77..
భద్రాచలం: కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే మూడు నెలల జీతాలు సగమే పొందిన టీఎస్ఆర్టీసీ కార్మికులు.. జూన్ నెల జీతమైనా పూర్తిగా వస్తుందనుకుంటే వారికి వేదనే మిగిలింది. ఎంతో ఆనందంతో పేస్లిప్లు చూసుకున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కొందరికి సగం జీతం కూడా రాలేదు. మరికొందరికైతే పది రూపాయల కంటే తక్కువగా జీతం పడటం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు సూపర్ వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. బస్సులో పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్ల ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకోవడం లేదు. పనిచేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు.
ఈ క్రమంలో రూ. 100 కంటే తక్కువగా కొందరికి జీతం వస్తే.. మరికొందరికి వెయ్యిలోపే వచ్చింది. చాలా మంది ఉద్యోగులకు 4వేల నుంచి రూ. 5వేల జీతం వచ్చింది.
భద్రాచలం డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ. 7 వేతనం మాత్రమే వచ్చిందని పేస్లిప్ చూపించి వాపోయాడు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ. 57 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో వ్యక్తికి 77 రావడం గమనార్హం.
తనకు రూ. 999 మాత్రమే జీతంగా వచ్చిందని వాపోయాడు. ఇలా చాలా మంది ఉద్యోగులకు అతి తక్కువ మొత్తాలు జీతంగా రావడంతో ఎంప్లాయిస్ యూనియన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పాటితో జీతాలతో ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది.