కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి సవాల్: మేము యూనియన్ వదిలేస్తాం..సీఎం రాజకీయ పార్టీని వదిలేస్తారా..!
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పైన ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన వైఖరి ఎంచుకున్నారు. ఆయన వైఖరి మీద ఆర్టీసీ కార్మిక సంఘాలు సైతం అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి తాజాగా విధుల్లో చేరని ఉద్యోగులను ఇక సర్వీసులోకి తీసుకోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వ..ప్రయివేటు భాగస్వామ్యంతోనే తెలంగాణ ఆర్టీసి నడుస్తుందని స్పష్టం చేసారు. కొత్త ఉద్యోగులను తీసుకుంటామని..అయితే ఆర్టీసీలో ఉద్యోగాల్లో చేరే వారు తాము కార్మిక యూనియన్లలో చేరబోమని అఫిడవిట్ ఇవ్వాలని సూచించారు.
ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయంగానే కాకుండా..కార్మిక సంఘాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. సీఎం చేసిన ఈ వ్యాఖ్యల మీద ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రివి దర్మార్గమైన ఆలోచనలు అంటూ ఫైర్ అయ్యారు. అదే సమయంలో అశ్వత్థామరెడ్డి చేసిన మరి కొన్ని వ్యాఖ్యలు ప్రభుత్వానికి మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
యూనియన్ వదిలేస్తాం..సీఎం పార్టీని వదులుతారా..
ఆర్టీసీ సమ్మె పైన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు..ప్రకటనలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాల్లో చేరేవారు భవిష్యత్ లో కార్మిక యూనియన్లలో చేరబోమని అఫిడవిల్ ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీని పైన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం చెబుతున్నట్లుగా తాము ట్రేడ్ యూనియన్ వదిలేస్తామని..మరి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పార్టీని వదులుతారా అని ప్రశ్నించారు. ఇది తన సవాల్ అంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి మతి భ్రమించి మాట్లాడుతున్నాంటూ అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్టీసీలోనూ..ప్రభుత్వంలోనూ కలకలం రేపుతున్నాయి.
ఆ హక్కు ముఖ్యమంత్రికి లేదు..
ఆర్టీసీ ఆస్తులపై కన్నేసారని..అందుకే దానిని ప్రయివేటీకరించే నిర్ణయం తీసుకున్నారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. సంస్థలో సగం ప్రయివేటు బస్సులు తీసుకొనే ఉద్దేశం ఈ కుట్రలో భాగమన్నారు. ఆర్టీసి కార్మికులు..కార్మికులు నిర్ణయించిన విధానాలతో క్రమబద్ద నియామక ప్రక్రియలో ఉద్యోగాలు పొందారని గుర్తు చేసారు. రాజకీయ నేతలు మంత్రులు..ఛైర్మన్లు అయినట్లు కాదని వ్యాఖ్యానించారు. అలాంటి ఉద్యోగులను ఎలా తొలిగిస్తారని ఆయన ప్రశ్నించారు. తమకు రాజ్యాంగ హక్కులు ఉన్నాయని..వాటిని కూలదోసే హక్కు ముఖ్యమంత్రి లేదని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయాలను తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.
కార్మికులు భయపడవద్దు..
ముఖ్యమంత్రి నిర్ణయాలతో కార్మికులవరూ భయపడాల్సిన అవసరం లేదని అశ్వత్థామరెడ్డి భరోసా ఇస్తున్నారు. తమ సమ్మె న్యాయ బద్దమైనదని..ప్రజలు కూడా గమనిస్తున్నారని వివరించారు. ఇప్పుడు ప్రజలు తెలంగాణతో పాటుగా ఆర్టీసీని సైతం కాపాడుకోవాల్సిన తరుణం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గ ఆలోచన ఏంటో ఇప్పుడు వెల్లడైందంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు కార్మిక సంఘాల్లో ఉండవద్దని చెబుతున్న ముఖ్యమంత్రి రాజకీయ పార్టీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు.
వయసులో చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని సిద్ధం కాగా, ఇప్పుడు అనుమతి లేదంటున్నారని, అదే సమయంలో తాము తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులరి్పంచి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొన్నారు.