TSRTC Strike: కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారా?: అశ్వత్థామ రెడ్డి ఏమన్నారంటే..?
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మరుసటి రోజే మళ్లీ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నామని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకుంటారని..
ఈ క్రమంలో శనివారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. తాము తమ సమ్మెను కొనసాగిస్తామన్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ జేఏసీ జారీ చేసిన ప్రకటనను ఎండీకి పంపిస్తామని తెలిపారు. ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.
ఎంజీబీఎస్లో మహిళా ఉద్యోగినులు..
ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మానవహారాలు నిర్వహిస్తామన్నారు. నిరసనలు కార్యక్రమాలు కూడా కొనసాగుతాయన్నారు. ఎంజీబీఎస్లో మహిళా ఉద్యోగులు
ఉదయం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు.
కేసీఆర్ నిర్ణయం తర్వాతే..
హైదరాబాద్లో ఉన్న డిపోల నుంచి మహిళా ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఎవరూ భయపడొద్దని, ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని చెప్పారు.
ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరతామని ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామన్నారు. సమ్మెపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఆదివారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపార.
ఖమ్మంలో ఉద్రిక్తత..
కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగి సుమారు 50 రోజులు అవుతున్నాయి. ఈ సందర్భంగా సేవ్ ఆర్టీసీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మంలో ఈ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ఖమ్మం బస్టాండ్ వద్దకు చేరుకున్న కార్మికులు కొందరు ఓ బస్సు అద్దాలను పగలగొట్టారు. బస్సుల టైర్లలో గాలి తీసేశారు. అంతేగాక, తాత్కాలిక సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.