అతిపెద్ద గిరిజన జాతర 'మేడారం'తో తెలంగాణ ఆర్టీసీకి కోట్ల నష్టం!
హైదరాబాద్: పండుగలు, జాతర్లు, వరుస సెలవుల వచ్చే సందర్భాల్లో ప్రత్యేక బస్సులను నడిపి ఆర్టీసీ పెద్ద ఎత్తున కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని ఖజానాకు సమకూర్చుకుంది. అయితే ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర మాత్రం తెలంగాణ ఆర్టీసీకి నష్టాలనే మిగిల్చినట్లు తెలిసింది.
గతేడాది జరిగిన మేడారం జాతరలో 16 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన ఆర్టీసీ, ఈ సంవత్సరం సుమారు 18 లక్షల మందిని జాతర అనంతరం గమ్యస్థానాలకు చేర్చినప్పటికీ, అంతకు మించిన ఖర్చు చేయడంతో నష్టం తప్పలేదంటున్నారు.
మేడారం జాతరలో భాగంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ డిపోల నుంచి తెప్పించిన దాదాపు 650 బస్సులు ఖాళీగా ఉండిపోయాయి. ఈ బస్సుల నిర్వహణకు ప్రత్యేకంగా వచ్చిన సిబ్బందికి అదనపు వేతనాలు, వారి వసతి తదితర ఖర్చులు ఆర్టీసీపై అదనపు భారమైనట్లు తెలిసింది.
దీంతో పాటు బస్సులు నెమ్మదిగా కదలడం వల్ల కేఎంపీఎల్ (కిలోమీటర్ పర్ లీటర్) వైఫల్యం, ఏసీ, హైటెక్ బస్సుల రిజర్వేషన్లకు పెద్దగా ఆదరణ రాకపోవడం కూడా తెలంగాణ ఆర్టీసీకి నష్టాన్ని పెంచిందంటున్నారు. మరోవైపు మేడారం జాతరలో బస్సులు పూర్తిగా నిండకుండానే నడిపించారన్న ఆరోపణలూ వచ్చాయి.
ఆదివారం నాటికి తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సేవలు ఉపయోగించుకున్నారు. 15 వేల ట్రిప్పులను ఆర్టీసీ నడిపించింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, టీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణారావు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.
బస్సుల రాకపోకల వివరాల విషయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల మేరకు మేడారం భక్తుల రాక పోకల సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీలైనంత ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపించారు.
టీఎస్ఆర్టీసీ అందిస్తున్న సేవల పట్ల రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి సంతృప్తి వ్యక్తంచేశారు. మొత్తం మీద చూస్తే మేడారం జాతర వల్ల తెలంగాణ ఆర్టీసీకి రూ. 4 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చినట్టు సమాచారం.