ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు: ఇద్దరికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
పెద్దపల్లి: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికుస్తున్న కారు.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సజ్జనార్ కు చిన్నగాయంతో తప్పించుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఎగ్గు నాగరాజు(38), అతని భార్య లక్ష్మి, అంతర్గాం మండలం రాయదండికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మి వారి సొంత ఆటోలో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువులను పరామర్శించి రామగుండంకు తిరుగు పయనమయ్యారు.
అదే సమయంలో ధర్మారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే వీరి ఆటోను వెనుక నుంచి వచ్చిన సజ్జనార్ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాగరాజు, లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. భూమయ్య, నూనె లక్ష్మికి చిన్న గాయాలతో బయటపడ్డారు. వారిని హైవే అంబులెన్స్ ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. ఈ ప్రమాదంలో సజ్జనార్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆటో ఒక్కసారిగా అడ్డు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బాధితుల వివరాలను తెలుసుకున్నారు.