లాభాల్లోకి రాకుంటే ఆర్టీసీ ప్రయివేటు బాట : ఛార్జీల పెంపు ఖాయం - కొత్త ప్రతిపాదనలు ఇలా..!!
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..విద్యుత్ సంస్థల ను కాపాడుకోవటానికి ఎంతో కొంత భారం ప్రజల పైన వేయక తప్పదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసిని నాలుగు నెలల్లో లాభాల రూట్ లో పెట్టకుంటే ప్రయివేటీకరణ ఆలోచన తప్పదని హెచ్చరించినట్లుగా కొత్తగా నియమితులైన ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కిలో మీటరుకు 25 పైసల పెంపు
ఇదే సమయంలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ పైన సమీక్ష చేసిన సీఎం..ఛార్జీలు పెంచకుంటే సంస్థ మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుందంటూ అధికారులు ఇచ్చిన నివేదికతో టిక్కెట్ల రేట్లు పెంపు కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. వచ్చే కేబినెట్ నాటికి పెంపు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో..అధికారులు కొత్త ఛార్జీల మీద పలు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచేందుకు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు.
మరో రెండు ప్రతిపాదనలు సిద్దం
దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28-30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు. పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ.65 ఉంది.
ఆర్టీసీ పై నష్టాల భారం తగ్గించేందుకే
ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ప్రతీ రోజు సంస్థ పైన రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. ఆ లెక్కన సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది.
Recommended Video
కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం
ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని అధికారులు మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించి..ఆర్టీసీ పరిస్థితులు వివరించనున్నారు.
ఎంత మేర పెంచితే ఏ మేర సంస్థకు ఉపశమనం లభిస్తుందో వివరించాలని నిర్ణయించారు. దీంతో..సాధారణ ప్రయాణీకుల పైన భారీగా భారం లేకుండా మధ్యే మార్గంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచటం మాత్రం ఖాయమనే విషయం స్పష్టమవుతోంది. ఈ మొత్తానికి రానున్న కేబినెట్ సమావేశంలో క్లారిటీ రానుంది. పండుగల సమయంలో సాధారణంగా ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయటం కామన్ అయిపోయింది. దీంతో..పండుగల సమయంలో కొత్త ఛార్జీల నిర్ణయం అమలు చేస్తారా..ముందుగానే నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.