తెలంగాణ ఆర్టీసీలో 25వేల కొత్త కొలువులు: ప్రతిపాదనలు సిద్దం: వారి పైన వేటు సాధ్యమేనా..!
Recommended Video
ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలకు అనుగుణంగా అధికారులు కసరత్తు ముమ్మరం చేసారు. సమ్మెలో ఉన్న కార్మికులు వాళ్లంతటగా వాళ్లే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని..కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి కొనసాగింపుగా ఆర్టీసీలో ప్రయివేటు భాగస్వామ్యం తప్పదని స్పష్టం చేసింది. ఇక, కొత్తగా ఆర్టీసీలో ఉద్యోగాల్లో చేరేవారు యూనియన్లలో చేరనని అఫిడవిట్ ఇవ్వాలని సీఎం స్పస్టం చేసారు. ఈ క్రమంలోనే ఒక వైపు కార్మిక సంఘాలు రాజకీయ మద్దతుతో సమ్మె కొనసాగిస్తుండగా..మరో వైపు ప్రభుత్వం ఆర్టీసీలో కొత్త కొలువుల భర్తీకి రంగం సిద్దం చేస్తోంది.
అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోవటంతో..దాదాపు 25 వేల కొత్త కొలువుల భర్తీకి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసింది. అయితే..ప్రభుత్వం తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఏకంగా 48 వేల కార్మికుల పైన వేటు వేస్తే జరిగే పరిణామాలను అంచనా వేసిన ప్రభుత్వం ఆ ప్రతిపాదన పైన చర్చ చేయటం లేదు. ఇదే సమయంలో అధికారులు మాత్రం అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్దం అవుతున్నారు.
25 వేల సిబ్బంది భర్తీకి అనుగుణంగా..
ఆర్టీసీలో సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త సిబ్బంది నియామకానికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు.. ఎన్ని పోస్టులు కొత్తగా భర్తీ చేయాలనే దానిపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్ డిపోల పరిధిలో డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్లు, సూపర్వైజర్లు తదితర కేటగిరీల లెక్కలు తేల్చిన ఆర్టీసీ యాజమాన్యం.. ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఆర్టీసీలో మూడు పద్ధతుల్లో బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిబ్బంది అవసరం ఏ మేరకు ఉంటుందనే దానిపై అంచనాలు తయారు చేసిన అధికారులు ఏ విధంగా నియామకాలు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. కొత్తవిధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్లు ఇతర సిబ్బంది కలుపుకొంటే దాదాపు 25 వేల మంది వరకు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించిన ఆర్టీసీ.. సీఎం కేసీఆర్కు సమర్పించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోగలదా..
ముఖ్యమంత్రి హెచ్చరించినట్లుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లుగా భావించటం సాంకేతికంగా సాధ్యం కాదు. ప్రభుత్వం వారి మీద వేటు వేస్తున్నట్లుగా నోటీసు ఇవ్వాలి..లేదా ఉద్యోగులు వారంతటగా వారు విధుల నుండి తప్పుకుంటున్నట్లుగా లేఖలు ఇవ్వాలి. ఈ రెండు జరగకుండా ప్రస్తుతం సమ్మెలో ఉన్న కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులుగా తీసేసినట్లు కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సిబ్బంది విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కొత్త వారిని నియమించుకుంటే ప్రభుత్వానికి మరో సమస్య మొదలైనట్లే. అయితే..15న కోర్టులో ఆర్టీసీ సమ్మె పైన విచారణ ఉండటంతో ఆ రోజు సమస్య ఒక కొలిక్కి వస్తుందనే ఆశాభావం అటు ప్రభుత్వంలో..ఇటు కార్మిక సంఘాల్లో కనిపిస్తోంది. అయితే, సెలవులు ముగుస్తుండటంతో సోమవారం నుండి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా ప్రధానంగా హైదరాబాద్ లో ఇబ్బందులు తప్పేలా లేవు.
ప్రయివేటు బస్సులతో సేవలు..
సమ్మె కారణంగా ఎటువంటి ఇబ్బందులు లేవని చెబుతున్న ప్రభుత్వం మరింతగా ప్రయివేటు సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇక, ఆర్టీసీ సంఘాలతో చర్చలకు అవకాశం లేదని ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెబుతోంది. దీంతో.. యాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన సమాచారం 5788 బస్సులు నడిపినట్లు తెలిపారు. ఇందులో 3,766 ఆర్టీసీ, 2,022 అద్దె బస్సులున్నాయన్నారు. 6 వేల ప్రైవేట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సోమవారం ఉదయానికి మరింతగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.