సీఎం కేసీఆర్ మాటలకు అర్థాలే వేరు! ఆర్టీసీ ప్రింటింగ్ప్రెస్ మూసివేత
హైదరాబాద్: 'ఆడవారి మాటలకు అర్థాలే వేరు' అనేది నానుడి. కానీ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్తున్న మాటలకు, ఇస్తున్న హామీలకు.. ఆచరణ ఎలా ఉంటాయో తేలింది. మాట తప్పని, మడమ తిప్పని గొప్ప నేతగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు లభిస్తున్న ప్రచారం. ఆయన చెప్తున్న దానికి భిన్నంగా ఏం జరిగిందో అసలుసిసలు నిదర్శనమేమిటో బయటపడింది.'సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్సంస్థల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించం. అది మా పార్టీ విధానం.
వాటిపై ఆధారపడి వందల మంది తెలంగాణ బిడ్డల కుటుంబాలు బతుకుతున్నాయి. అవి ఉద్యోగాలను సృష్టించే సంస్థలు. వాటి ద్వారా మరిన్ని కొలువులు ఇస్తాం' సింగరేణి గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో గెలుపొందాక ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. రెండు రోజులు కూడా తిరగకుండానే హైదరాబాద్ నగర శివారుల్లోని మియాపూర్లోని ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్ మూసివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
ప్రెస్ కార్మికులు ఇలా డిపోలకు బదిలీలు
ఆర్టీసీ ప్రింటింగ్ ప్రెస్లో పని చేస్తున్న కార్మికులను వివిధ డిపోలు, స్టోర్లకు బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రెస్లో పనిచేస్తున్న కార్మికులను ఎక్కడెక్కడికి బదిలీ చేస్తున్నారో తెలుపుతూ ప్రింటింగ్ప్రెస్ నోటీస్ బోర్డులో బహిరంగ నోటీసు పెట్టారు. బైండర్లు, సీనియర్, జూనియర్ మెషిన్ మైండర్లు, బైండర్లు, శ్రామిక్లు సహా దాదాపు 53 మందిని వివిధ డిపోలకు బదిలీ చేస్తున్నట్టు ఆ నోటీసులో తెలిపారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్ మూసివేత ఖరారైంది. ఈ నోటీసు చూసిన కార్మికులు ఆగ్రహంతో మండిపడ్డారు. సర్కారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ధర్నా నిర్వహించారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రింటింగ్ప్రెస్ కార్మికుల బదిలీ అయిన ప్రాంత ఉద్యోగులుగా గుర్తించబడతారని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఖరిని నిరసించిన ఆర్టీసీ కార్మికులు
సెప్టెంబర్ 30వ తేదీతో ఉన్ననోటీసును శనివారం ఆర్టీసీ ప్రింటింగ్ప్రెస్ నోటీసుబోర్డులో పెట్టారు. ఇంత జరుగుతున్నా టీఎస్ఆర్టీసీలో గుర్తింపు కార్మికసంఘం టీఎంయు నేతలు అశ్వద్ధామరెడ్డి, ధామస్రెడ్డి సహా ఎవరూ ఆ పరిసరాల్లో కనిపించలేదు. విషయం తెలుసుకున్న టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసించారు.
సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఇలా..
టీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించబోమని సీఎం కేసీఆర్ చెప్పిన మరుసటిరోజే అక్కడి కార్మికులను బదిలీ చేస్తూ నోటీసు ఇవ్వడం దుర్మార్గం అని టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. సింగరేణి విజయంతో తమకు అడ్డు ఉండదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మూసివేతను సీఎం కేసీఆర్ భాషలో ఏమనాలో ఆయనే చెప్పాలన్నారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించి సంస్థలో కొత్తగా మరో 1,400 అద్దె బస్సుల్ని ప్రవేశ పెట్టారని ఆరోపించారు. ఇది ప్రయివేటీకరణ కాక మరేమిటని ప్రశ్నించారు. ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించాక వరంగల్ రీటైర్ సెంటర్ను మూసివేశారని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు.
ఇలా ఔట్ సోర్సింగ్కు ఆర్టీసీ కళ్యాణమండపం
తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రి, బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపం ఔట్సోర్సింగ్కు ఇచ్చేస్తూ టీఆస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. తాజాగా మియాపూర్ ప్రింటింగ్ ప్రెస్ మూసివేశారని, త్వరలో ఇక్కడి బస్బాడీ యూనిట్ను కూడా ప్రయివేటుకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేన్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. కార్మికులు ఈ విషయాల్ని గమనించాలని, సంస్థ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని అభ్యర్థించారు. లేకుంటే భవిష్యత్లో టీఎస్ఆర్టీసీ అనేది మనుగడలోనే ఉండకుండా పోయే ప్రమాదం ఉన్నదని వీఎస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.