TSRTC STRIKE:మరో కండక్టర్కు గుండెపోటు.. నిమ్స్కు తరలింపు...
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, జీతాలు రాకపోవడంతో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. శుక్రవారం కృష్ణయ్య గౌడ్ అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు హన్మకొండలో మరో కండక్టర్ గుండెపోటుకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.
టీవీ చూస్తూనే..
ఆర్టీసీ సమ్మె, టీవీల కథనాలు చూస్తున్న ఓ కండక్టర్ గుండెపోటుకు గురయ్యారు. హన్మకొండలోని తన ఇంటిలో టీవీ చూస్తున్న రవీందర్ అనే కండక్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఇప్పటికే ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మనోవేదనతో వారంతా గుండెపోటుతో చనిపోయారు. మరో కండక్టర్కు గుండెపోటు రావడం కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది.
డ్రైవర్కు గుండెపోటు
మహబూబ్నగర్ డిపోకి చెందిన కృష్ణయ్య గౌడ్ గురువారం గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. వేతనం లేక అతని కుటుంబం ఇబ్బంది పడిందని ఆర్టీసీ నేతలు చెప్తున్నారు. కృష్ణయ్యది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని చెప్తున్నారు. కృష్ణయ్య 20 ఏళ్ల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం బండమీదిపల్లి అని కార్మిక నేతలు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ బంద్
కృష్ణయ్యతో ఆర్టీసీ కార్మికుల మృతి 17కి చేరుకుంది. సకల జనుల సమరభేరీ సభకొచ్చిన కరీంనగర్కి చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ గురువారం చనిపోయారు. బాబు మృతితో కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శుక్రవారం కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చారు. మృతుని కుటుంబసభ్యులను స్థానిక ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు.