‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్లైన్తో ఆగిన మరో కార్మికుడి గుండె
కరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయారు. మరికొందరు ఎటూ తేల్చుకోలేక తీవ్రంగా మదనపడ్డారు. ఇప్పటికే పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా.. తాజా మరో కార్మికుడి గుండె ఆగింది.
కరీంఖాన్ గుండె ఆగింది..
కరీంనగర్-2 డిపోలో మెకానిక్గా పనిచేస్తున్న కరీంఖాన్ బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన కుటుంబాన్ని ఆర్టీసీ సంఘాల నేతలు, అఖిలపక్షం నేతలు పరామర్శించారు. కరీంఖాన్ మృతికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మొండి వైఖరి కారణంగానే..
కార్మికులతో చర్చలు జరపకుండా డెడ్లైన్ పెట్టిన మానసిక ఆందోళనలకు గురిచేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే కరీంఖాన్ ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. ఇంకా ఎంతమంది చనిపోతే సీఎం స్పందిస్తారని మృతుడు కరీంఖాన్ కుమారుడు మహమ్మద్ అసద్ ఖాన్ కంటతడి పెడుతూ ప్రశ్నించారు.
బెదిరింపులతో కార్మికుల ప్రాణాలు తీస్తున్నారు..
ఆర్టీసీ మెకానిక్ కరీంఖాన్ మృతిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. కరీంఖాన్ మృతి బాధాకరమని అన్నారు. సీఎం కేసీఆర్ డెడ్లైన్లు పెట్టి బెదిరింపులకు దిగుతూ కార్మికుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టినా లెక్క చేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు.
ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..
మొండిపట్టుదల వీడాల్సింది కార్మికులు కాదని.. ముఖ్యమంత్రి కేసీఆరే మొండితనం వీడి చర్చలు జరపాలని బండి సంజయ్ హితవు పలికారు. ఓ వైపు కార్మికుల ప్రాణాలు పోతున్నా కేసీఆర్లో చలనడం కలగడం లేదని మండిపడ్డారు. కాగా, కేసీఆర్ నవంబర్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ గడువులోగా కేవలం 487 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మిగితా దాదాపు 49వేల మంది కార్మికులు సమ్మెలోనే కొనసాగుతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.