TSRTC Strike: హైకోర్టు సూచన, సమ్మెపై అశ్వద్ధామ రెడ్డి ఏమన్నారంటే?
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల ప్రక్రియను ముగించాలని హైకోర్టు సూచించిందని ఆయన తెలిపారు.
చర్చలు ఫలిస్తేనే..
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే.. తాము వెళతామని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. చర్చల ఫలితాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగానే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అన్ని రకాల నిరసనలు తెలిపిన తర్వాతే సమ్మెకు దిగామని చెప్పారు. సమస్యలను పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని అన్నారు.
ప్రజలు నలిగిపోతున్నారు..
కాగా, ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు వెంటనే సమ్మె విరమించాలని సూచించింది. సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కార్మిక సంఘాలపై ప్రశ్నల వర్షం..
నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయి కాదా? హైకోర్టు కార్మిక సంఘాలను ప్రశ్నించింది. పండగలు, పాఠశాలలు కొనసాగుతున్న సమయంలో సమ్మెకు దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అయితే, చర్చలు జరిపే వీలు లేకుండా పోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సమ్మె కార్మికుల ఆఖరి అస్త్రమని, సమ్మె విరమిస్తే సమస్య పరిష్కారం కాదని ఆర్టీసీ సంఘాలు వాదనలు వినిపించాయి. సమ్మె చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాదా? అని ప్రశ్నించింది హైకోర్టు. ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని నిలదీసింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవే కావొచ్చు కానీ.. సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు తెలిపింది.
మీకు బాధ్యత లేదా?
ఇక ప్రభుత్వంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేస్తే పాఠశాలలకు సెలవులు ఎందుకు ప్రకటించారని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని సూచించింది.