టీఎస్ఆర్టీసీ సమ్మె.. ఏపీకి పండుగ .. తెలంగాణాకి దండగ .. ఎలా అంటే
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ పండుగ చేసుకుంటుంది . తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పండుగ సందర్భంగా వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను నడపటంతో కోట్లలో లాభాలు గడించింది . తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసి , ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని భావించి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపింది. ఏపీఎస్ఆర్టీసీ ఈ దసరా సీజన్ లో తెలంగాణా ఆర్టీసీ ఖాతాలో పడే కోట్ల రూపాయల సొమ్మును తమ ఖాతాలో వేసుకుంది .
తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా ఉంది వరంగా మారింది. నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో పండుగ చేసుకుంటోంది.సెప్టెంబర్ 27నుంచి ఈనెల 13వరకు మొత్తం 5887 ప్రత్యేక బస్సుల ద్వారా ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పడింది. నిత్యం 75వేల మందిని తరలించి తమ పని తాము చేసుకుపోవటంతో కాసుల వర్షం కురిసింది. విజయవాడ ఇంద్రకీలాద్రి పై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటానికి తెలంగాణా నుండి పెద్ద ఎత్తున విజయవాడకు వచ్చిన వారంతా ఏపీ బస్సులను ఆశ్రయించారు. ఫలితంగా తెలంగాణా ఆర్టీసీ నష్టాలను, ఏపీ ఆర్టీసీ లాభాలను చవి చూసింది.
ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలో విలీనం చేసి, ఆర్టీసీ ఉద్యోగుల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించింది. ఇక ఏపీ తరహా నిర్ణయం తీసుకుని తెలంగాణా ఆర్టీసీని కాపాడాలని తెలంగాణా ఆర్టీసీ కారమికులు సమ్మెకు దిగారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీఎస్ఆర్టీసీ ని పండుగ సమయంలో లాభాల బాట పట్టించింది . దసరా పండుగ సీజన్ లో గత ఏడాదితో పోలిస్తే ఏపీ ఆర్టీసీకి అదనంగా రూ.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు . అక్యుపెన్షీ రేషియో కూడా ఏకంగా 103శాతానికి పెరిగిందంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో ఏపీ ఆర్టీసీకి లాభాల పంట పండగా తెలంగాణాకు దండగ వచ్చింది.