తెలంగాణ ఉద్యమం తలపించేలా చేస్తాం.. సీఎం కేసీఆర్కు స్ట్రాంగ్ కౌంటర్..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం (18.10.2019) నాటితో సమ్మె 14వ రోజుకు చేరింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పొలిటికల్ లీడర్లు, వివిధ సంఘాల నేతలు అండగా ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు సపోర్టుగా నిలుస్తున్నారు. అదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సీఎం కేసీఆర్పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ ఉద్యమాన్ని తలపించేలా భారీ ఉద్యమానికి నాంది పలుకుతామని హెచ్చరించారు.
పాలనను అటెకెక్కించిన కేసీఆర్ ప్రతిష్ట కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికుల పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడుతోందని.. ఆ క్రమంలో తెలంగాణలో కార్యకలాపాలు స్తంభించాయని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా లింగంపల్లి చౌరస్తా నుంచి బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేపట్టాయి. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు.
ఉద్యమంతో గెలిచి, పోరాటాలను అణిచి.. విద్యాసంస్థల సెలవుల పొడిగింపు అందుకేనా..!
గతాన్ని మరిచిపోయి కేసీఆర్ నియంతలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు లక్ష్మణ్. పరువు ప్రతిష్ట అంటూ పాకులాడే కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నీ వర్గాల ప్రజలు అండగా నిలబడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు నియంతృత్వ ధోరణి కళ్లకు కడుతోందని.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాలు కలగడం సహజం అన్నారు. ఇక ఇంత జరుగుతున్నా రవాణా శాఖ మంత్రి సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమం తలపించేలా బీజేపీ భారీ ఉద్యమానికి నాంది పలకబోతుందని హెచ్చరించారు.