TSRTC STRIKE:మిలియన్ మార్చ్, హైకోర్టు విచారణ, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు మిలియన్ మార్చ్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోమవారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో తమ వాదనలపై చర్చించినట్టు తెలిసింది. గత విచారణలో ప్రభుత్వం, కార్మికులు మానవతా దృక్పథంతో ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తమ వాదనలను మరింతబలంగా వినిపించాలని చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై కోర్టు వ్యాఖ్యలపై కూడా డిస్కస్ చేసినట్టు తెలిసింది. మరోవైపు శనివారం కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్ గురించి సమావేశంలో చర్చకొచ్చింది. కార్మికులు బెట్టువీడతారా ? లేదా డిమాండ్లపై ఏం చేయాలనే అంశంపై డిస్కస్ చేశారు. కార్మికులను సెల్ఫ్ డిస్మిస్గా భావిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు 5100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఇది సరికాదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం, కార్మికులు ఏమీ కాదని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు.