టీఎస్ఆర్టీసీ సమ్మె, అధికారులతో సీఎం సమీక్ష.. కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు
ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశంలో అధికారులులో పాటు సంబంధిత రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇతర ముఖ్యనేతలు పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ భవితవ్యం తేల్చేందుకు సీఎం సమాయత్తమైనట్టు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఎలాంటీ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఉత్కంఠ అటు కార్మిక వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడ నెలకొంది. అయితే కార్మికులను విధుల్లోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
డిమాండ్లను పక్కన పెట్టి ముందుకు వచ్చిన ఆర్టీసీ
హైకోర్టు తీర్పు నేపథ్యంలో బేషజాలను పక్కనబెట్టి ఆర్టీసీ కార్మికులు ముందుకు వచ్చారు. విలీన డిమాండ్ను ఇప్పటికే పక్కన పెట్టిన కార్మికులు... పూర్తిగా సమ్మె విరమించి విధుల్లో చేరతామని ప్రకటించారు. అయితే భేషరుతుగా కార్మికులకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, సమ్మెకు ముందున్న వాతవరణ పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. షరతులు లేకుండా ప్రభుత్వం అంగీకరిస్తే... తాము విధుల్లో చేరతామని స్పష్టం చేశారు.
కార్మికులకు రెండు సార్లు అవకాశం
దీంతో సమస్య ప్రభుత్వ కోర్టులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే కార్మికుల భవితవ్యం తేలనుంది. సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా రెండు సార్లు విధుల్లోకి చేరాలని సీఎం అవకాశం ఇచ్చారు. కాని కార్మికులు మాత్రం ఆయన చేసిన విజ్ఝప్తిని పక్కన పెట్టారు. కనీసం ఉద్యోగుల్లో ఒక్క శాతం కూడ ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి.
సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం
మొత్తం మీద సీఎం కేసీఆర్ పంతం నెగ్గించుకున్న సీఎం కేసీఆర్ కార్మికుల విజ్ఝప్తిపై సానుకూలంగా స్పందించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రజా రవాణలేక ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన సీఎం దిగిరాకపోతే ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యో అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కార్మికులకు వరంగా మారే పరిస్థితి నెలకోంటుంది. దీంతో సీఎం కొన్ని నిబంధనలతో తిరిగి కార్మికులను విధుల్లోకి తీసుకుంటారనే ఉహాగానాలు వెలువడుతున్నాయి.
నిబంధలపై నివేదిక ఇచ్చిన సునిల్ శర్మ
సమీక్ష సమావేశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరగనుంది. కోర్టు ప్రకారం ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటుపై సమాలోచనలు చేయనున్నారు. దీంతోపాటు కార్మికులు ముందుకు రావడంతో వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం ద్వార ఎలాంటీ పరిణామాలు ఉత్పన్నమవుతాయనే అంశాన్ని కూడ చర్చించనున్నారు. ఇందుకోసం అధికారులు సైతం ఉదయం నుండి సమాలోచనలు జరిపారు. నిబంధనలు, చట్టాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ ప్రభుత్వానికి నివేదిక కూడ అందించారు. ఇక నివేదికలు ఎలా ఉన్నా... ప్రజలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి సీఎం కూడ కార్మికులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటారనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.