ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కరుణ, కుటుంబాలపై కూడా, ఉద్యోగం ఇస్తామని వరం, హర్షం
ఆర్టీసీ జేఏసీ నేతల మెట్టుదిగడంతో.. సీఎం కేసీఆర్ కూడా బెట్టువీడారు. ఆర్టీసీ కార్మికులపై కరుణ చూపించారు. విధుల్లో చేరేందుకు ప్రభుత్వం సమ్మతిస్తున్నట్టు తెలిపారు. కానీ అని ఆర్టీసీ జేఏసీ నేతలు, ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. యూనియన్ నేతల మాయలో కార్మికులు పడొద్దని హితవు పలికారు. ఇప్పటివరకు ఓకే.. కానీ భవిష్యత్లో ఆందోళన బాట పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
26 కాదు 21కి ఓకే..
ఆర్టీసీ కార్మికులు 26 డిమాండ్లతో ఆందోళన బాటపట్టారు. ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని బెట్టుచేశారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. 21 డిమాండ్లు తీరుస్తామని స్పష్టంచేసినా.. జేఏసీ నేతలు వినిపించుకోలేదు. దీంతో హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సమ్మెను కోర్టు కూడా తప్పుపట్టడం, లేబర్ కోర్టుకు వ్యవహారం చేరడంతో కార్మిక నేతలు తోకముడిచారు. రెండురోజుల కింద సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే విధుల్లో చేరేందుకు వెళతామని చెబితే.. అలా కుదరదని ఎండీ స్పష్టంచేయడంతో మళ్లీ మొదటికొచ్చింది.
డ్యూటీలో చేరండి..
తమ ఉద్యోగం ఉన్నట్టా లేనట్టా అనే అనుమానం ఆర్టీసీ కార్మికులకు కలిగింది. విధుల్లో చేరతామని కూడా ఆందోళనకు దిగారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గం.. ఆర్టీసీపై ఫోకస్ చేసింది. సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ కార్మికులు విధుల్లో చేరాలని కోరారు. కానీ అంటూ వారికి షరతులు విధించారు. మళ్లీ సమ్మెబాట పడితే తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ తప్పదని హెచ్చరించారు. ఇకనైనా చక్కగా పనిచేయాలని సూచించారు. సిరులు కురిపిస్తోన్న సింగరేణిలా ఆర్టీసీని తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు.
కుటుంబాలకు ఆపన్నహస్తం
ఆర్టీసీ సమ్మె వల్ల దాదాపు 30 మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లు చనిపోయారు. ఆ కుటుంబాలపై సీఎం కేసీఆర్ కరుణ చూపించారు. ఆ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని స్పష్టంచేశారు. ఆర్టీసీ లేదంటే ప్రభుత్వంలో కొలువు ఇస్తామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాల్లో పిల్లల చదువులను బట్టి జాబ్ అందజేస్తామని తెలిపారు. వారు తమ పిల్లలేనని స్పష్టంచేశారు. ఎవరూ లేకుంటే కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని చెప్పారు. యూనియన్ నాయకుల మాయలో పడి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు.
స్వార్థం కోసం
ఆర్టీసీ యూనియన్ నేతలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తమ స్వార్థం కోసం కార్మికులను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. సమ్మెపై హైకోర్టు చీఫ్ జస్టిస్ తనతో మాట్లాడారని గుర్తుచేశారు. యూనియన్ నేతలు మూర్ఖత్వాన్ని పరిగణలోకి తీసుకొవద్దని కోరారని తెలిపారు. ఇటీవల రాజ్భవన్లో తనతో చెప్పిన విషయాన్ని కేసీఆర్ తెలిపారు. కార్మికులు తమ పిల్లలని, అందుకే మానవత్వం చూపి విధుల్లో చేరేందుకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు.
వెల్ కం
సీఎం కేసీఆర్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కార్మికులను విధుల్లోకి తీసుకోవడం మంచి పరిణామనని పేర్కొన్నారు. ప్రైవేట్ రూట్లకు అనుమతి ఇచ్చినందున.. కొందరు కార్మికులనే విధుల్లోకి తీసుకుంటారనే చర్చ జరిగింది. దీంతో ఎవరినీ తీసుకుంటారు ? మిగతావారిని ఏం చేస్తారనే ఉత్కంఠ కొనసాగింది. కానీ ఊహాగానాలకు చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు అండగా నిలువడాన్ని స్వాగతిస్తున్నారు. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.