TSRTC STRIKE:మొక్కుబడి చర్చలొద్దన్న కోదండరాం, అధికారులతో కేసీఆర్ సమీక్ష, గవర్నర్ ఆరా
ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం మొక్కుబడి చర్చలు జరిపిందని తెలంగాణ జన సమితి విమర్శించింది. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ అధినేత కోదండరాం విమర్శించారు. చర్చల పేరుతో జేఏసీ నేతలతో నిర్బంధించారని.. ఆర్టీసీ యాజమాన్యమే ముందు వెళ్లిందనే విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్లను పరిష్కరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
అవమానించారు
ఆర్టీసీ కార్మికులు 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందని మండిపడ్డారు. చర్చల పేరుతో పిలిచి కార్మికులను అవమానించారని మండిపడ్డారు. శనివారం ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు మొక్కుబడిగా జరిపినవేనని స్పష్టంచేశారు. పైగా డిమాండ్ల పేరుతో తప్పును కార్మిక సంఘాలపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
మరోసారి చర్చలు
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోదండరాం డిమాండ్ చేశారు. కార్మికులను చర్చలకు పిలువాలని అల్టిమేటం జారీచేశారు. దీపావళి వేళ ప్రపంచమంతా వెలుగులు నింపుకుంటే.. ఆర్టీసీ కార్మికులు మాత్రం అంధకారంలో ఉన్నారని గుర్తుచేశారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏం చేద్దాం
ఇదిలా ఉంటే మరోవైపు ఆర్టీసీ సమ్మెపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చల వివరాలు అడిగి తెలుసుకుంటారు. అలాటే ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ అంశంపై కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో విచారణ 28వ తేదీకి వాయిదాపడింది. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించడంతో.. శనివారం చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టులో కౌంటర్ ఏం దాఖలు చేయాలనే అంశంపై డిస్కషన్ జరగనుంది.
గవర్నర్ ఆరా
మరోవైపు ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కూడా స్పందించారు. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని తెలిపారు. అన్ని సంఘాల నుంచి తమకు దరఖాస్తులు వచ్చాయని.. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.