ఆర్టీసీ సమ్మె: కల్వకుంట్ల కుటుంబానికి ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కుటుంబాల శాపం.. యాష్కీ
ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకున్న సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నేతలు వీ హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదని వీహెచ్ ప్రశ్నించారు. వారి కుటుంబాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు.
సరికాదు..
కోర్టు ఆదేశాలను కూడా కేసీఆర్ సర్కార్ బేఖాతరు చేస్తుందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి ఎండీని నియమించాలని కోరినా పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా నియంతలా వ్యవహరించడం సరికాదన్నారు. మరోవైపు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను వీహెచ్ అభినందించారు. గతంలో ఏ గవర్నర్ కూడా మంత్రులకు స్వయంగా ఫోన్ చేయలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్ నిన్న మంత్రి పువ్వాడ అజయ్కు ఫోన్ చేసిన సంగతి తెలసిందే.
డీజిల్పై పన్ను ఎందుకు
ఆర్టీసీ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణమని వీహెచ్ ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు సంబంధించి డీజిల్పై వ్యాట్ను ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు. డీజిల్పై వ్యాట్ తగ్గిస్తే సంస్థకు ఆర్థికపర ప్రయోజనం చేకూరుతుంది కదా అని అన్నారు. ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడ్డారు.
ఆర్టీసీకి అప్పులా..
ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్ కళ్లు తెరిపించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల గురించి గవర్నర్ చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీకి రూ.5 వేల కోట్ల అప్పులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని.. అదీ ఉత్తిమాటేనని కొట్టిపారేశారు.
పరిహారం ఇవ్వాల్సిందే
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యభూమిక పోషించారని తెలిపారు. సకల జనుల సమ్మెలో భాగంగా 41 రోజులు సమ్మె చేసి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారని మధుయాష్కీ పేర్కొన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు చేసిన ఆత్మ బలిదానాలు కళ్లముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ పాపం కల్వకుంట్ల కుటుంబానికి శాపంగా మారుతుందన్నారు. వారి కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.