ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదా.. ఉద్యమంలో మీ జాడేది.. ఆ ముగ్గురు మంత్రులపై రేవంత్ చిందులు..!
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతం అవుతోంది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో కార్మికులు సైతం బెట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు కార్మికులకు సపోర్టుగా నిలుస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. తాజాగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్తో పాటు మంత్రులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు ఇవాళ మీకు కనిపించడం లేదా అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ తీరును ఎదురించలేని పరిస్థితిలో మంత్రులు ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్పై మరోసారి భగ్గుమన్న రేవంత్ రెడ్డి
ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదంటూ మరోసారి గరమయ్యారు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా సమ్మె చట్టబద్దం కాదంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. కొన్ని సంఘాలకు గుర్తింపు లేదంటూ వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేక కేసీఆర్.. స్క్రిప్టులు పంపుతూ పేపర్లలో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆనాడు ఆర్టీసీకి జై.. ఈనాడు కేసీఆర్కు సై.. మంత్రి ఎర్రబెల్లి తీరు ఇలా..!
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు.. ఇవాళ మంత్రులా?
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కొందరు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఉద్యమానికి ఏమాత్రం అండగా నిలబడని వాళ్లు ఇవాళ మంత్రులుగా చలామణీ అవుతున్నారని.. సీఎం కేసీఆర్ చెప్పినదానికి తలాడిస్తూ జీ హుజుర్ అంటున్నారని మండిపడ్డారు. మంత్రులుగా స్వతంత్రం లేని వీళ్లు.. ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదంటూ ఆయన ఇచ్చిన స్క్రిప్టునే వల్లె వేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన కోసం చెమట చిందించనోళ్లు కూడా ఇవాళ ఆర్టీసీ సమ్మె సరికాదనడం భావ్యం కాదన్నారు.
ఈటల, తన్నీరు సమ్మెను తప్పు అనడం లేదు.. ఆ ముగ్గురు మంత్రులేందో మరి..!
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను ఏకతాటి పైకి తెచ్చి కార్మికులు క్రీయాశీలకంగా పాల్గొనేలా మంత్రి ఈటల రాజేందర్ చొరవ చూపారు. మరి ఇవాళ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు చట్టబద్దత కాదని.. ఆయన చేస్తోంది తప్పని ఎందుకు నిలదీయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇక తెలంగాణ మజ్దూర్ యూనియన్కు గౌరవ అధ్యక్షులుగా ఉన్న మంత్రి హరీశ్ రావు ఏమయ్యారని నిలదీశారు.
అయితే ఈ ఇద్దరు మంత్రులు కూడా ఆర్టీసీ సమ్మెను తప్పు పట్టడం లేదని.. కేసీఆర్కు భయపడి మాత్రమే మౌనం వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు దగ్గరగా మెదిలిన ఈటల రాజేందర్, హరీశ్ రావు ఈ సమ్మె గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని.. అదే క్రమంలో ఆ ముగ్గురు మంత్రులు మాత్రం కేసీఆర్ చెప్పినట్లు ఆర్టీసీ సమ్మె తప్పు అని మాట్లాడుతుండటం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
అక్కడ టీఆర్ఎస్కు కష్టమేనా.. ఈ లెక్కలు ఆ పార్టీకి అనుకూలమా?
ఆ ముగ్గురు మంత్రుల గురించి అందరికీ తెలుసు..!
మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ఆర్టీసీ సమ్మెపై అదోలా మాట్లాడుతున్నారంటూ ఫైరయ్యారు రేవంత్ రెడ్డి. అసలు ఈ ముగ్గురు తెలంగాణ కోసం ఏనాడైనా ఒక్క పూట తినకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎవరు తెలంగాణ వద్దనుకున్నారో, ఎవరు తెలంగాణను నిండా ముంచాలనుకున్నారో, ఎవరు తెలంగాణను తెగ అమ్ముదామని అనుకున్నారో, ఎవరైతే ఆనాడు తెలంగాణ పిల్లల చావుకు కారణమయ్యారో.. వాళ్లే ఇవాళ ఆర్టీసీ సమ్మెను తప్పంటున్నారని విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. ఇలాంటి మంత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.