టీఎస్ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్... ఊడుతున్న బస్సుల చక్రాలు..! పర్యవేక్షణ లేక ప్రమాదాలు
ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపం లా మారాయి. అత్యవసరాల కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు తాత్కాలిక ఉద్యోగులతో బెంబేలెత్తి పోతున్నారు. బస్సులో వెళితే సేఫ్గా వెళతామని బావించే వారు ప్రస్తుత పరిణామాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఆర్టీసీ ప్రైవేట్ ఉద్యోగులపై సరైన పర్యవేక్షణతో పాటు, బస్సుల కండిషన్ను కూడ తనిఖి చేసే పరిస్థితి లేకపోవడంతో గత ఎనిమిది రోజులుగా రాష్ట్రంలోని ఎక్కడో ఓ చోట ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈనేపథ్యంలోనే తాజాగా నల్గోండ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు వెనక చక్రాలు రెండు ఊడిపోయిన సంఘటన ప్రయాణికుల్లో ఆందోళనను రేపింది.జిల్లాలోని నార్కట్పల్లి మండల కేంద్రం నుండి నల్గోండకు వెళుతున్న బస్సు ఎల్లారెడ్డి గూడెం వద్దకు చేరుకోగానే రెండు వెనక చక్రాలు ప్రమాదవశాత్తు ఊడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు నిలిపాడు. బస్సు చక్రాలు ఊడిపోయిన సమయంలో మొత్తం అరవై మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటీ గాయాలు కాలేదు.
ఇక ఉదయం నిజామాబాద్ జిల్లా మాక్లుర్ మండలం దాస్నగర్ సమీపంలో తాత్కాలిక డ్రైవర్కు ఆకస్మాత్తుగా మూర్చ రావడంతో బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు పక్కనే ఉన్న పోలాల్లోకి వెళ్లింది. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇక మరికొన్ని చోట్ల వాగులు పొంగిపోర్లుతుండడంతో రూటు సరిగా తెలియని డ్రైవర్లు కాజ్వేల నుండి వెళుతుండడంతో ప్రమాదానికి గురైన సంఘటనలు నెలకొంటున్నాయి. ఇక ఇప్పటికైన ఆర్టీసీ ఆధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు..