ఆర్టీసీ సమ్మె రణరంగం.. అరెస్టులు, తోపులాటలు.. 11వ రోజు ఉద్రిక్తం
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. రాష్ట్రమంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తెలంగాణ ఉద్యమం నాటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పలుచోట్ల కార్మికులు నిరసనలకు దిగుతుండటంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాట జరిగి టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది.
అదలావుంటే ఇదివరకే పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. తాజాగా తెలంగాణ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ లోని 21 విద్యుత్ సంఘాలు సంఘీభావం తెలిపాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి ఆందోళనల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
రోజురోజుకీ సమ్మె ఉధృతం.. మెట్టు దిగని ప్రభుత్వం
ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతమవుతోంది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారా అని భగ్గుమంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్రమంతటా నిరసనల సెగ కనిపిస్తోంది. సమ్మె 11వ రోజుకు చేరడంతో మంగళవారం నాడు కూడా పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. కార్మికులకు మద్దతుగా రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాలు బాసటగా నిలుస్తున్నాయి. హైకోర్టు న్యాయవాదులు కూడా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా హైకోర్టు దగ్గర ర్యాలీ నిర్వహించారు.
ఆర్టీసీ సమ్మె వెనుక గులాబీ నేతలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
ఆర్టీసీ కార్మికుల నిరసన సెగలు.. రణరంగంలా రాష్ట్రం.. నేతలు అరెస్ట్
ఆర్టీసీ కార్మికుల నిరసనలు, ఆందోళనలతో రాష్ట్రం రణరంగం తలపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నాటి సీన్లు కనిపిస్తున్నాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకుంటుండటం.. తోపులాట జరగడం చూస్తుంటే ఆనాటి ఉద్యమ ఘట్టాల్ని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు అండగా నిలుస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అటు కరీంనగర్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మరోవైపు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టెన్షన్ సిట్యువేషన్ కనిపించింది. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత అదుపు తప్పినట్లైంది.
సీఎం ఇలాకాలోనూ ఆందోళన పర్వం.. కరీంనగర్లో మోకాళ్లపై నిలబడి
సీఎం కేసీఆర్ సొంత ఇలాకా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా మారింది. బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, సంఘాలు మద్దతుగా నిలిచాయి. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఆందోళన కార్యక్రమాలు భగ్గుమన్నాయి. ఆర్టీసీ కార్మికులతో పాటు వామపక్ష పార్టీల నేతలు కలిసి మానవహారం చేపట్టారు. అటు కరీంనగర్ బస్స్టాండ్ ఇన్గేట్ ఎదుట సీఎం కేసీఆర్, మంత్రులకు పిండ ప్రదానం చేసి వినూత్న నిరసన తెలిపారు కార్మికులు. అఖిల పక్షం నేతలు మోకాళ్లపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదా.. ఉద్యమంలో మీ జాడేది.. ఆ ముగ్గురు మంత్రులపై రేవంత్ చిందులు..!
రాస్తారోకోలు, మానవహారం, ర్యాలీలు.. భగ్గుమంటున్న నిరసన సెగ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు మిన్నంటాయి. వేములవాడ బస్స్టాండ్ ఎదుట చేపట్టిన మానవహారంలో కాంగ్రెస్ పార్టీ, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌక్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సును కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప వాగ్వాదం జరిగింది. అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో లీడర్లు, వివిధ సంఘాల నేతల మద్దతుతో ఆర్టీసీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రింగ్ సెంటర్లో మానవహారం చేపట్టారు. మరోవైపు కొత్తగూడెంలో అఖిల పక్షం నేతలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.